— జూలై 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
–ఆశాలు, జిపి కార్మికులు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలి
–సీఐటీయు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ
Modi anti-labour policies : ప్రజాదీవెన నల్గొండ : కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ ల రద్దును కోరుతూ జులై 9న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం దేశవ్యాప్త సమ్మె నోటీసు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ట శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గత వందేళ్ళ క్రితం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4లేబర్ కోడ్ లను తీసుకొస్తున్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయి. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంబంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికొద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుంది. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కార్మిక ఐక్య పోరాటలను ఉదృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన జులై 9 దేశ వ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె క్యాంపెయిన్ విజయవంతంగా నిర్వహించడం కోసం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు పోలె సత్యనారాయణ ఆశ యూనియన్ నాయకులు ఎడవెల్లి ప్రేమలత,బి రేణుక, సి శోభ, ఆకారం శోభ తదితరులు పాల్గొన్నారు.