–రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు
–తెలంగాణ రైజింగ్ 2047 పేరున పేదల కోసం సమగ్ర పాలసీలు
–నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపం, పోరాటాల పొద్దుపొడుపు
— అలాంటి నల్గొండలో పుట్టడం గర్వకారణం
— రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
–రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ పథకం ఆవిష్కరన
–అమరులకు నివాళులు
Nalgonda District Development : ప్రజాదీవెన , నల్గొండ : నల్గొండ జిల్లా సర్వోతోముఖాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి పని చేద్దామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం ఆయన నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలకిచ్చిన సందేశంలో తెలంగాణ రాష్ట్రం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా, రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎంతోమంది పోరాటాల వల్ల తెలంగాణ సాధించుకోగలిగామని, తాను సైతం తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగిందని, నల్గొండ అంటే నమ్మకానికి ప్రతిరూపమని, పోరాటాల పొద్దుపొడుపు అని, అలాంటి నల్గొండలో పుట్టడం సంతోషమని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 పేరున పేదల సంక్షేమం కోసం సమగ్ర పాలసీలను రూపొందించిందని, ప్రపంచ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు.
ఆడబిడ్డల సంక్షేమంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయగా, 203 కోట్ల 78 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగిందని,500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పథకం కింద రెండు లక్షల 34994 మంది లబ్ధిదారులకు 6 లక్షల 47 వేల సిలిండర్లు ఇవ్వగా, ప్రభుత్వం సబ్సిడీ కింద 18 కోట్ల 58 లక్షలు రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. మహిళలకు ఇందిరమ్మ ఇండ్లతోపాటు, విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందిరా మహిళ శక్తి పథకం కింద జిల్లా కలెక్టర్ కార్యాలయా ఆవరణలో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించుకున్నామని తెలిపారు.
రుణమాఫీ కింద జిల్లాలో రెండు లక్షల 33,981 మంది రైతులకు రెండువేల 44.8 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, రైతు భరోసా కింద ఈ యాసంగి లో ఇప్పటివరకు 4,33543 మంది రైతులకు సుమారు 414 కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేయడం జరిగిందని, యాసంగి ధాన్యం సేకరణలో భాగంగా నల్గొండ జిల్లాలో ఐదు లక్షల 91729 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచామని, రైతులకు ఖాతాలలో 1210 కోట్ల రూపాయలను చెల్లింపులు చేసినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు సాలినా 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసేందుకు గాను 25603 కుటుంబాలను గుర్తించడం జరిగిందని చెప్పారు. జిల్లాలో నాలుగు లక్షల 84210 మంది కుటుంబాలకు 997 చౌక ధర దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరు జిల్లాలో చొప్పున 8 వేల 868 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేసామని, పారదర్శకంగా కుల గణన నిర్వహించి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం జరిగిందని, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలో భాగంగా నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని, నల్గొండ, మునుగోడు నియోజక వర్గాలలో ఈ పాఠశాలలకు శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని, భవిత కేంద్రాలలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ఒక కోటి 20 లక్షలు అనుమతులు ఇచ్చామని, అన్ని పాఠశాలలకు మూడు లక్షల 54 వేల పాఠ్య పుస్తకాలు, 6 లక్షల 20వేల నోట్ పుస్తకాలు ఇచ్చామని, జిల్లాలో నాలుగు ఐటిఐ లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు కోట్ల 77 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా ఆధునికరించెందుకు టాటా టెక్నాలజీతో 31 కోట్ల5 లక్షలు, ప్రభుత్వం నాలుగు కోట్ల 74 లక్షల రూపాయల అత్యాధునిక మిషనరికి ఖర్చు చేసిందని, నల్గొండ ఐటిఐ ప్రాంగణంలో 20 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు .
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా జిల్లాలో 19698 గృహాలను కేటాయించి 16,412 గృహాలకు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగిందని, మొదటి విడతన 1906 గృహాలు మంజూరు చేయగా 610 గృహాలు గ్రౌండ్ అయ్యాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో భాగంగా నిర్వహించిన ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా ఆసియా దేశాలకు చెందిన 25 మంది సుందరిమణులు బుద్ధవనాన్ని సందర్శించడం జరిగిందని చెప్పారు.
—10 వేల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి…
నీటిపారుదల కింద జిల్లాలో ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్లేముల ప్రాజెక్టు కింద పదివేల 100 ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి పంప్ హౌస్ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఇటీవల కాలంలో 37 ఎకరాలల్లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద కళాశాలను ప్రారంభించుకోవడం జరిగిందని, ఐదు ఎకరాలలో 40 కోట్ల రూపాయలతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన శంకుస్థాపన చేయడం జరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రిలో 24 కోట్ల రూపాయలతో దేశంలో ఎక్కడా లేనివిధంగా క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని మంత్రి తెలిపారు.
కనగల్ మండలంలో ఒక కోటి 58 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని, అంతేకాక దేశంలోనే మొదటిసారిగా గ్లూకోమా కంటి పరీక్షలు కనగల్లు లో ప్రారంభించడం జరిగిందన్నారు. నల్గొండ పట్టణంలో లతీఫ్ సాహెబ్ గుట్ట, బ్రహ్మంగారిమఠం, శివాలయం గుట్ట ఘాట్ రోడ్ నిర్మాణానికి 140 కోట్ల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయని, నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో 36 కోట్ల రూపాయలతో ఆదనపు విభాగాన్నీ నిర్మించనున్నామని, ఈ పనులు పురోగతిలో ఉన్నాయని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు వెళ్లేందుకు నామ్ రోడ్డు పనులను కలుపుతూ నాలుగో వరుసల సిసి రోడ్డు నిర్మాణానికి 236 కోట్లు మంజూరు చేయబడ్డాయని, ఇవి ప్రారంభ దశలో ఉన్నాయని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఎనిమిది వేల మంది కార్మికులు నిరంతరంగా థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేస్తున్నారని, రెండవ యూనిట్ గత ఏడాది డిసెంబర్లో ప్రారంభం కాగా, మిగతా మూడు యూనిట్ల నిర్మాణం పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో 86 కోట్ల 80 లక్షల రూపాయలతో 35 ఉపవిద్యుత్ కేంద్రాలు మంజూరయ్యాయని వెల్లడించారు. జిల్లా అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, నెల్లికంట సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. బాల భవన్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. వివిధ రంగాలలో ఉత్తమ సేవలందించిన ఆరుగురికి జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. అభివృద్ధిని తెలిపే విధంగా శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు మంత్రి క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాల నుంచి అమరులకు నివాళులర్పించారు.