–సౌకర్యాలు అవసరమైతే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేసేందుకు సిద్ధం
–రాష్ట్ర రోడ్డు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komati reddy Venkata reddy ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రతీక్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆధునికరించిన భవిత కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం అయన నల్గొండ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆధునికరించిన భవిత కేంద్రాన్ని ప్రారంభించారు. భవిత కేంద్రం లో విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఆట వస్తువులు, ప్రత్యేక పరికరాలు, సౌకర్యాలను మంత్రి పరిశీలించారు.
కేంద్రం నిర్వాహకులతో మంత్రి మాట్లాడుతూ ఇంకా ఏవైనా సౌకర్యాలు అవసరమైతే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదివరకే ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఇంకా ఎలాంటి సౌకర్యాలు కావాలో తెలియజేయాలని కోరగా, స్పీచ్ థెరపీ ఏర్పాటు చేయాలని, వారానికి రెండుసార్లు విద్యార్థులకు స్పీచ్ తెరఫీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలుపగా, అందుకు మంత్రి అంగీకరించారు. కాగా భవిత కేంద్రం ఆధునికీకరణ, యాక్టివిటీ రూమ్, ఇతర మౌలిక వసతుల పనులకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇదివరకే 10 లక్షలు మంజూరు చేయగా, జిల్లా కలెక్టర్ నిధుల ద్వారా మరో ఏడు లక్షల రూపాయలను భవిత కేంద్రంపై వెచ్చించడం జరిగింది.
భవిత కేంద్రంలో సౌకర్యాలు లోటు లేకుండా చూసుకోవాలని, ప్రత్యేకించి ఏసి ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి భోజనం పెడుతున్నారని అడగగా, పౌష్టికాహారంతోపాటు, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని సెంటర్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పిల్లలకు చాక్లెట్లను పంపిణీ చేశారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ శరత్చంద్ర పవర్,అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఈఓ బిక్షపతి, ఎంఈఓ అరుంధతి, ఇతర అధికారులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పిటిసి లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.