Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ISI Terror Hub : నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా

–ఉగ్రవాదులకు నల్గొండ సేఫ్ జోన్

–తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమే

–మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

— జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న అన్నదాతల హరిగోస అని ఆగ్రహం

ISI Terror Hub :ప్రజాదీవెన నల్గొండ :నల్గొండ జిల్లా ఐఎస్ఐ తీవ్రవాదుల అడ్డా అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో సీనియర్ బిజెపి నాయకులకు జరిగిన సన్మాన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా మూలాలు నల్గొండ లోనే కనబడతాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు నల్గొండ సేఫ్ జోన్ గా మారిందని ఆరోపించారు. నల్గొండలో ఓవైపు ఐఎస్ఐ ఉగ్రవాదం, మరోవైపు వామపక్ష తీవ్రవాదం ఈ రెండూ బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరి అనుమతితో మదర్సా లు నడుస్తున్నాయని మదర్సాల పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

పహల్దాం ఘటన తర్వాత భారత్ లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశీయులను బయటికి పంపమని కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని అయినా తెలంగాణ ప్రభుత్వానికి సోయి లేదని దుయ్యబట్టారు. కులగణన చేశామని గొప్పలు చెబుకుంటున్నారని, కులగణన తప్పుల తడక అని కాంగ్రెస్ నేతలే ఒప్పుకున్నారని ఎద్దేవ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న ధాన్యం కొనుగోళ్లు చేయక అన్నదాతలను అరగోస పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి గురైన మృతదేహాలను కూడా బయటికి తీయలేని చేతకాని ప్రభుత్వ రాష్ట్రంలో ఉందన్నారు.

తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పథకాలు గ్రామ గ్రామాన పాతుకుపోయాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. ఏది ఏమైనా ఈసారి బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు 17 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని అన్నారు.ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు చింతా సాంబ మూర్తి, బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, వీరేల్లి చంద్రశేఖర్, దోనూరు వీరారెడ్డి, బెజవాడ శేఖర్, శ్యాంసుందర్, జగ్జీవన్, కూతురు సత్యవతి, పిల్లి రామారాజు యాదవ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.