— ఉపాధి హామీకి నిధుల కోత, కార్పొరేట్ శక్తులకు మోత
–మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జులై 9 సమ్మె
–నారి ఐలయ్య
Nari Ilayya: ప్రజాదీవెన నల్గొండ: మోడీ ఆర్థిక విధానాలవల్ల, వారి పాలనలో వ్యవసాయ కార్మికులు, పేదలు, కవులు రైతులు 60 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వారికి రక్షణ లేదని, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య ఆరోపించారు. ఉపాధి హామీకి నిధులు కోత పెట్టి కార్పొరేట్ శక్తులకు మాత్రం పెద్ద ఎత్తున సబ్సిడీలు ప్రకటించారని విమర్శించారు. ఈ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు, కార్మికులు, రైతాంగం సంఘటితంగా జూలై 9 సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య భవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే యోగ ఒకటే కాదని ప్రజలందరికీ తినడానికి పోషక హారము ఉండాలని, ప్రభుత్వం పౌష్టికమైన హారము అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో పేదలకు పనిచేసి బతకడానికి పని దొరకడం లేదని సరైన హారం లేదని దీనితో అనేక మంది పేదలు అనారోగ్యాలకు గురై చనిపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలనే కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని, గత సంవత్సరం దేశవ్యాప్తంగా 380 కోట్ల పని దినాలు ఉంటే ఈ సంవత్సరం 280 కోట్ల పరిధినాలకు కుదించారని అన్నారు. ఉపాధి హామీ ఎత్తివేతకు మోడీ చేస్తున్న కుట్రలను వ్యవసాయ కూలీలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకు దేశంలో ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోతుందని నిత్యవసర వస్తువుల వినియోగంలో 100 దేశాల కన్నా మన దేశం వెనుకబడి ఉందని ఆవేదన వెలిబుచ్చారు.
మోడీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త కొత్త విధానాలతో మచ్చిక చేసుకుని భారత దేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. మతం పేరుతో జనం మోడీ ప్రభుత్వానికి అణిగి మణిగి ఉండాలని చూస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీ విధానాల వల్ల భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకిక తత్వానికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షవాదులు, లౌకిక శక్తులు, ప్రజాతంత్ర వాదులు సంఘటితంగా ఐక్యంగా పోరాటాలను ఉధృతంగా కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి 50 లక్షల ఎకరాల మిగులు భూములు ఉన్నాయని ఆ భూములన్నింటినీ భూమి లేని ప్రతి పేద కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. భూమి ఉంటే ఆత్మగౌరవం ఉంటుందని, పేదరికం పోతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందుతాయి, బ్యాంకు రుణాలు కూడా వస్తాయని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కోనేరు రంగారావు భూ సిఫారసులను అమలు చేసి పేదలకు ప్రభుత్వ భూములను పంచాలని, సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని విస్తరింప చేయాలని. డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూమిలేని పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ ఉపాధ్యక్షులు తేలకలపల్లి శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు సిరిశాల గిరి కుమార్, అశ్విని, దండంపెల్లి యాదయ్య, కృష్ణ, సర్దార్ అలీ, మారయ్య, చెరుపల్లి శివమ్మ, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.