–క్షయ వ్యాధినివారణ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
— సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Revenue Sadassu petitions : ప్రజాదీవెన నల్గొండ : భూభారతి లో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, టి బి ముక్త్ భారత్ కింద టిబి,(క్షయ)నివారణ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో క్షయ వ్యాధినివారణకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ప్రజలు టైఫాయిడ్,డెంగ్యూ తదితర వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని చెప్పారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రత కార్యక్రమాలు పెంచాలన్నారు.ఎరువులకు ఇబ్బంది లేకుండా చూడాలని వ్యవసాయ అధికారిని, ఇందిరమ్మ ఇండ్లు వేగవంతం చేయాలని హౌసింగ్ పి డి ని ఆదేశించారు.వనమహోత్సవం కింద నాటే మొక్కలు,తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
–మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ…
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఆన్ లైన్ ద్వారా హాజరైన రాష్ట్ర
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈ సంవత్సరం నిర్వహించే వనమహోత్సవం పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, సమూహాలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, ఒక రోజు ఒక శాఖ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని, వనమహోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, జిల్లాకు ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు తప్పనిసరిగా మొక్కలు నాటేలా ఏర్పాటు చేయాలని, అన్ని పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటాలని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మొక్కలు అధికంగా నాటాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని సూచించారు.
ప్రముఖులు మొక్కలు నాటే స్థలాన్ని ముందే గుర్తించాలని, రహదారికి ఇరువైపులా నాటే మొక్కలు, రహదారికి ఇరు వైపులా, అలాగే మీడియన్ లో పొడవైన మొక్కలు నాటాలని, అడవుల్లో జంతువులు, పక్షుల కి ఆహారంగా
వచ్చే పండ్ల, మొక్కలు నాటాలని,
వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కలెక్టర్లది ముఖ్యపాత్ర అని అన్నారు.
–సిఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ…
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు గృహ నిర్మాణ, వ్యవసాయ, రెవెన్యూ ,సీజనల్ వ్యాధులు, టి బి నియంత్రణ పై సమీక్ష నిర్వహించారు.గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రత్యేకించి జిల్లా కలెక్టర్లు ఈ పథకం కింద పట్టణ స్థాయిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ను సమీక్షించాలని, అలాగే మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు, ఇసుక, బిల్లులు, పురోగతి
తదితర అంశాలను ఎప్పటికప్పుడు
పర్యవేక్షించాలని సిఎస్ ఆదేశించారు.
వ్యవసాయం కింద రైతు భరోసా, ఎరువుల నిర్వహణను ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఎరువులు ఇతర జిల్లాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలను తనిఖీ చేయించాలని, ఆయిల్ పామ్ తోటల లక్ష్యాలను సాధించాలని చెప్పారు.
వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులందరూ హాజరయ్యేలా చూడాలని, లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని
వైద్య ఆరోగ్య శాఖ తో పాటు, ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడాలని అన్నారు. అలాగే టిబి ముక్తి భారత్ కింద ప్రజలు టి బి వ్యాధి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
రాష్ట్ర స్థాయి నుండి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాగా, జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటు, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, నారాయణ అమిత్, జిల్లా అటవీశాఖాధికారి రాజశేఖర్, గృహనిర్మాణ శాఖ పిడి రాజకుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్,డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, హార్టికల్చర్ డిడి అనంత రెడ్డి తదితరులు హాజరయ్యారు.