Revanth Reddy : ప్రజాదీవెన, హైదరాబాద్: రేపే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభిస్తామని అన్నారు. హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లో ఈ నాలుగు పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దని సూచించారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.