Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Resolving Land Disputes : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

–లావుణి పట్టా భూములు పట్టా చేయడం కుదరదు

–ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ కుదరదు

–కలెక్టర్ ఇలా త్రిపాఠి

Resolving Land Disputes : ప్రజాదీవెన నల్గొండ :  అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా ఈ నెల 3 నుండి 20 వరకు జిల్లాలోని అన్ని రెవిన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతున్నదని, రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ సదస్సులో సాదా బైనామాలు, పెండింగ్ మ్యుటేషన్ లు, సక్సేషన్స్ విస్తీర్ణంలో తప్పొప్పుల సవరణ, భాగ పంపిణీ, తదితర అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చని, అందుకే ఈ సదస్సులను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే విషయాలను రెవిన్యూ అధికారులు ప్రత్యేకించి తహసీల్దార్ ముందుగానే ఆయా గ్రామాలలో టాం, టాం వేయించి ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా కోరారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ లో భాగంగా బుధవారం ఆమె నల్గొండ జిల్లా, పెద్దవూర మండలం వెలమ గూడ లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించదమే కాకుండా, వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం, సమాధానాలను తెలియజేశారు.

సుమారు 70 వరకు దరఖాస్తులు సమర్పించగా, వీటిలో సాదా బైనామాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సక్సేషన్ల కరెక్షన్, భాగ పంపిణీ, శివాయ్ జమేదార్, పట్టా పాస్ బుక్ లో తప్పుల సవరణకు సంబంధించి ఎక్కువగా వచ్చాయి.
సదస్సుకు వచ్చిన రైతులు, ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ పాసుబుక్ లలో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చుని, చిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుకోవచ్చని తెలిపారు. లావుణి పట్టా భూములు పట్టా చేయడం కుదరదని, అదేవిధంగా ప్రభుత్వ భూములు కొన్న వారికి రెగ్యులరైజేషన్ చేయడం జరగదని, జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే రెవెన్యూ సదస్సులలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇనాం భూముల ఓ ఆర్ సి, డాక్యుమెంట్లు లేని భూములు తదితర భూముల గూర్చి తెలిపారు. రైతులు తప్పనిసరిగా వారి భూమికి సంబంధించిన కాగితాలను కలిగి ఉంటే సులభంగా పట్టా అవుతుందని, పట్టాలు పొందడం వల్ల రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే లాభాలన్నింటినీ పొందవచ్చని, ప్రత్యేకించి రైతు బంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు వంటివి తీసుకోవచ్చని తెలిపారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని వారికి సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, పెద్దవూర తహసిల్దార్ శ్రీనివాసరావు, ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి, హాబీబ్ అలీ, తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు.