Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Teacher suspension: కోరి తెచ్చుకున్న తంటాలు…మత ప్రచారం చేస్తున్న టీచర్ సస్పెన్సన్

ప్రజాదీవెన, ఎల్లారెడ్డిపేట: ప్రభుత్వ పాఠశాల మత ప్రచారం కేంద్రంగా మారింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మత బోధకుడిగా మారిపోయాడు. ఏకంగా విద్యార్థులకు బైబిల్ పంపిణి చేశాడు. ఈ విషయం పేరెంట్స్‌కి తెలియడంతో ఉపాధ్యాయుడిని నిలదీశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న లింగాల రాజు అనే ఉపాధ్యాయుడు క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో సుమారు 100 మంది విద్యార్థులకు గిఫ్ట్‌లు పంపిణీ చేశాడు. గిఫ్ట్ ప్యాక్‌లో ఆట వస్తువులు, కత్తెర, బిస్కట్, చాక్లెట్లు, పెన్నులు, బైబిల్ పుస్తకాలున్నాయి. బైబిల్ బుక్‌ను గమనించిన ఉపాధ్యాయులు ఆ గిఫ్ట్ బాక్స్‌ల పంపిణీని ఆపివేశారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పాఠశాలకు చేరుకొని ఆ గిఫ్ట్ ప్యాక్‌లను విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకొని ఉపాధ్యాయుడితో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎంఈవో కృష్ణహరి, ఎస్సై రమాకాంత్ పాఠశాల చేరుకొని విచారణ చేపట్టారు. స్థానికులు మండల విద్యాధికారికి వీడియోలు, ఫోటోలతో సహా ఫిర్యాదు చేశారు. ఉపాధ్యయుడిపై శాఖపరమైన చర్యలు ఉంటాయని స్థానికులకు తెలిపాడు.

పాఠశాలకు చేరుకున్న పోలీసులు గిఫ్ట్ ప్యాక్ బాక్సులను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించి పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు రాజుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఎంఈవో కృష్ణహరి జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డికి సాయంత్రం ఫిర్యాదు చేశారు. లింగాల రాజు సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు. ఇలా ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.