– డీజీపీ, అడిషనల్ డీజీపీల వాంగ్మూలాలు నమోదు
– మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకుల వాంగ్మూలాలు సైతం
Phone Tapping Case : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ట్యాపింగ్ కేసులో రోజు రోజుకూ కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా గా రాష్ట్ర డీజీపీ జితేందర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) అదనపు డీజీ అనిల్ కుమార్ల వాంగ్మూలా లను ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర హౌంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా జితేందర్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా అనిల్ కుమార్లు బాధ్యతలను నిర్వహించారు. ఆ సమయంలో సంఘవిద్రోహ శక్తులు, నిషేధిత మావోయిస్టుల ఫోన్ట్యాపింగ్ను జరిపే ప్రక్రియను పర్యవేక్షించే రివ్యూ కమిటీలో జితేందర్, అనిల్ కుమార్లు కూడా సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆ సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టుయేతర ప్రముఖులకు సంబంధించి ఫోన్ట్యాపింగ్ జరిపినట్టు తాజా దర్యాప్తులో వెలుగు చూసింది.
ఈ నేపథ్యంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న జితేందర్, అనిల్ కుమార్ల దృష్టికి ఈ విషయం వచ్చిందా? అప్పటి ఎస్ఐబీ ఓఎస్డీ ప్రభాకర్రావు తాను నిర్వహించిన ఫోన్ట్యాపింగ్లకు సంబంధించిన సమాచారాన్ని తన పైఅధికారుల దృష్టికి తీసుకొచ్చారా.. లేదా.. మొదలైన కోణాల్లో సిట్ అధికారులు వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు తెలిసింది. అయితే, దాదాపు 600కు పైగా ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి సమర్పించి, ఇవన్నీ కూడా మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులకు సంబంధించినవి గా అప్పటి ఎస్ఐబీ అధికారులు సమాచారమిచ్చినట్టు సిట్ దృష్టికి వచ్చిందని తెలిసింది. ఈ సందర్భంగా జితేందర్, అనిల్ కుమార్ల నుంచి కీలకమైన సమాచారాన్ని సిట్ అధికారులు వాంగ్మూలంగా సేకరించారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా పని చేసిన సీనియర్ ఐపీఎస్ మహేందర్రెడ్డి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైపాల్తో పాటు మరో నాయకుడు సైదులు బుధవారం సిట్ కార్యాలయానికి వచ్చి తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్టు వాంగ్మూలమిచ్చారు. కాగా, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్రావులు సిట్ ఎదుట వాంగ్మూలాన్ని ఇవ్వటానికి రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. తర్వాత వస్తారేమోనని అధికారులు అభిప్రాయపడ్డారు.