Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

chilkur balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయం ఆవరణలో తొక్కిసలాట

చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద గరుడ ప్రసాద వితరణ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఊహించని విధంగా భక్తులు తరలిరావడంతో వారిని అదుపుచేయలేక పోలీసులు చేతులెత్తేశారు

గరుడ ప్రసాద వితరణలో అపశృతి

ప్రజాదీవెన, చిలుకూరు: చిలుకూరు బాలాజీ(chilkur balaji) ఆలయం వద్ద గరుడ ప్రసాద వితరణ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఊహించని విధంగా భక్తులు తరలిరావడంతో వారిని అదుపుచేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఈ ఘటనలో పలువురు భక్తులకు(devotees) గాయాలయ్యాయి. మరోవైపు, వాహనాలు రాకతో చిలుకూరు వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఏకంగా 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాసబ్‌ట్యాంక్‌ నుంచి మెహదీపట్నం, నానల్‌ నగర్‌, లంగర్‌హౌస్‌, సన్‌సిటీ, అప్పా జంక్షన్‌ మీదుగా చిలుకూరు బాలాజీ ఆలయం వరకు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్‌ రింగ్‌ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. గరుడ ప్రసాదం కోసం దాదాపు లక్ష మంది వరకు వాహనాల్లో వెళ్లినట్లు అంచనా. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం అందజేయనున్నట్టు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌ ఇటీవల ప్రకటించారు. దీనిపై సోషల్‌ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాక మొదలైంది. కార్లు, ఇతర వాహనాల్లో ఆ మార్గంలోకి చేరుకోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో ఎక్కడక్కడ వాహనాలు నిలిచిపోయి.. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మెయినాబాద్ సీఐ పవన్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 10.30 గంటల వరకు 60వేలకు పైగా భక్తులు ఆలయానికి వచ్చారని తెలిపారు. ఇంకా వస్తూనే ఉన్నారని ఆయన చెప్పారు. ఆలయం వద్ద ఉదయం కొంత సమయం గరుడ ప్రసాదం పంపిణీ చేశారని.. ఆ తర్వాత నిలిపివేశారని సీఐ పేర్కొన్నారు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు అంచనా వేసి పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. 5 వేల మంది వరకు వచ్చే అవకాశం ఉందని మాకు చెప్పారని వివరించారు. ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు (devotees)రావడం వల్ల వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణికులు రావొద్దని సీఐ పవన్ కోరారు. బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణంతో ప్రారంభిస్తారు. ఆ రోజున శేషవాహన సేవలు నిర్వహిస్తారు. అలాగే, గరుత్మంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం సంతానం లేని మహిళలకు దీనిని ఈ ప్రసాదంగా పంపిణీ చేస్తారు. సంతానం లేని మహిళలు ఈ ప్రసాదం స్వీకరిస్తే.. సంతానం కలుగుతుందని నమ్ముతారు.

Devotees stampede at Chilukur Balaji Temple