— టి జి ఓ అధ్యక్ష్యుడు ఏలూరి శ్రీనివాసరావు
ప్రజా దీవెన, హైదరాబాద్: వేతన సవరణ కమిటీ ఏర్పడి సంవత్సరం దాటిందని ,నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది.ఈ మేరకు టి జి ఓ అధ్యక్ష్యుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో ఉద్యోగుల బృందం పిఆర్సీ చైర్మన్ శివశంకర్ ను కలసి తన ప్రాతినిద్యాన్ని అందచేసింది. జి ఓ 159 ద్వారా ఆక్టోబర్ 2,2023 లో శివశంకర్ రిటైర్డ్ ఐ ఏ యస్ అధికారి శివశంకర్ చైర్మన్ గా ఏర్పడిన వేతన సవరణ కమిటీ మొదటి ఆరు నెలలు అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ప్రతిపాదనలను స్వీకరించి ,నమోదు చేసుకుందని టి జి ఓ తెలిపింది.
ముఖ్యమంత్రి ఏప్రిల్ 2025 నుండి వేతన సవరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారని,త్వరగా నివేదికను అందచేస్తే ప్రభుత్వం అద్యయనం చేసి అమలు చేయడానికి వీలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వాని కి అందచేసే ముందు పి ఆర్ సి నివేదికలో పలు అంశాలను పరిగణించి ,పొందుపరచి ప్రభుత్వానికి అందించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కోరారు.1 -1- 2023 ,1-7-2023,1-1-2024,1-7-2024 వరకు పెండింగ్ లో నాలుగు కరువు భత్యాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందని తెలిపారు.
వీటిలో 1-1-2023 మరియు 1-7-2023 న ఇవ్వాల్సిన రెండు కరువు భత్యాలను వేతన స్థిరీకరణలో విలీనం చేసి,మూల వేతనముకు 40% ఫిట్ మెంట్ ను కలిపి పిఆర్సీ అమలు చేయడానికి అనువుగా సిఫారసు చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 16 సంవత్సరాల 11 నెలలు అనగా 3 వేతన సవరణ కాలాలను,తెలంగాణ లో రెండు సంవత్సరాల ,7 నెలల కాలాన్ని ఉద్యోగ వర్గాలు తమకు న్యాయంగా రావాల్సిన సహజహక్కు కోల్పోయారని గుర్తు చేసారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణం,టోకు ,వినియోగ ధరల సూచీ,వైద్య విద్య ఖర్చులతో ప్రభుత్వ ఉద్యోగులు సంక్షోభానికి లోనవుతున్నారు.గృహ,విద్యా రుణాల వాయిదాల చెల్లింపులో ఇక్కట్ల పాలవుతున్నారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణం,తీసుకుంటున్న వేతనానికి తీవ్ర వ్యత్యాసం సతమవుతున్నారని ,నెలకు కనీసంగా 20 వేల రూపాయలను అదనపు భారంకు ఉద్యోగులు లోనవుతున్నారని తెలిపారు.ఇప్పటికే పి ఆర్ సి కమిటీ తన సిఫార్సుల అందచేతలో 8 నెలలు జాప్యం జరిగిందని ,ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రభుత్వానికి అందచేయాలని కోరారు.
శివశంకర్ ను కలసిన బృందంలో టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ,సహ అధ్యక్ష్యుడు బి. శ్యామ్,ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు,సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్ రెడ్డి.యం పి డి ఓ ల సంఘ అధ్యక్ష్య కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి,మరిపల్లి ,రంగారెడ్డి టి జి ఓ అధ్యక్ష్యుడు డాక్టర్ రామారావు ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.