Mitra Poetry – A Comprehensive Review: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: మిత్ర కవిత్వం – సమగ్ర పరిశీలన అనే అంశంపై ప్రొఫెసర్ చింతకింది కాశీం పర్యవేక్షణలో పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన సి. అనిత కుమారిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని రేగడిమైలారం గ్రామంలో పుట్టిన పేదింటి బిడ్డ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న రోజుల్లోనే తండ్రిని కోల్పోయింది.
తల్లి కూలి నాలి చేసి తమ బిడ్డను చదివించుకుంది. తోబుట్టువులు సైతం తన చదువుకు అండగా నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో విమలక్క సారధ్యంలో సాంస్కృతిక సైన్యంలో చేరి ఉద్యమ పాటలపై, ఉద్యమ సాహిత్యం పై మరింత మక్కువ పెంచుకొని అదే సాహిత్యం పై పరిశోధన చేయటానికి పూనుకుంది. తెలంగాణ ఉద్యమంతో పాటు మరెన్నో సామాజిక ఉద్యమాల్లో పాల్పంచుకుంటూనే ఉన్నత చదువులను నిర్లక్ష్యం చేయకుండా పీహెచ్డీ పూర్తి చేసింది. ప్రగతిశీల భావాలు కలిగిన ఉస్మానియా లా కళాశాల విద్యార్థి నల్గొండ జిల్లా వాస్తవ్యులు పురం వెంకటేష్ ను జీవిత సహచరునిగా స్వీకరించింది. ప్రజా సమస్యలు ప్రజా సాహిత్యమే లక్ష్యంగా చేసుకొని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో పార్ట్ టైం అధ్యాపకురాలిగా ఎంతోమంది విద్యార్థులను సాహిత్యకారులుగా, ఉపన్యాసకులుగా తీర్చిదిద్దుతుంది.
గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా అదే గ్రామీణ ప్రాంతాల నుంచి విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలకు ఆదర్శంగా నిలుస్తుందని భావించిన యూనివర్సిటీ రిజి(స్టార్ అలువాల రవి, ఆర్ట్స్ కళాశాల ఫ్యాకల్టీ ఆఫ్ డీన్, కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపల్ కె. అరుణప్రియ, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె. ప్రేమ్ సాగర్, ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్ డా. పి. మద్దిలేటి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. ప్రశాంతి, తెలుగు శాఖ అధ్యాపకులు డా. ఎం. ఆనంద్, డా. ఎం. సత్యనారాయణ రెడ్డి, జి. నరసింహం, తెలుగు శాఖ విద్యార్థులు, సహధ్యాపకులు, అధ్యాపకేతర బృందం అభినందించారు.