–దండెంపల్లి సరోజ
Dandempalli Saroja: ప్రజాదీవెన నల్గొండ : ఉపాధి హామీ చట్టరక్షణకై కూలీల సమస్యల సాధనకై డిమాండ్ చేస్తూ ఈ నెల 30న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ మండలం పలు గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాలను పరిశీలించి మే 30న జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేదలు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య పోరాటం తోపాటు వామపక్షాల ఒత్తిడి మేరకు యూపీఏ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి వంద రోజుల పని గ్యారంటీ కోసం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధిస్తే నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా నిధులను క్రమక్రమంగా తగ్గిస్తూ ఎత్తివేయాలని కుట్ర చేస్తుందన్నారు.
గత సంవత్సరం 2.50 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి 90 వేల కోట్లు ఖర్చు చేసిన పాలకులు ఈ సంవత్సరం 86 వేల కోట్ల రూపాయలకు తగ్గించిందన్నారు. దీంతో కూలీల జాబ్ కార్డులు, పని దినాలు పెద్ద ఎత్తున తగ్గించడం జరుగుతుందన్నారు. పథకం ప్రారంభంలో 2005 సంవత్సరంలో కూలీలందరికీ పనిముట్లు గడ్డపార, పార ,తట్ట ,గొడ్డలి లాంటివి ఇస్తామని చెప్పి కేవలం కొద్ది మంది కూలీలకు ఇచ్చి గత పది సంవత్సరాలుగా కూలీలకు పనిముట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పనిచేసే చోట టెంటు, మంచినీళ్లు ఏర్పాటు చేయడం లేదని, వారం వారం రావలసిన కూలీ డబ్బులు 5, 6 వారాలుగా పెండింగ్ లోనే ఉంటున్నాయని దీంతో కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 307 రూపాయలు ఎవరికి అందని పరిస్థితిలు ఏర్పడ్డాయని, కేవలం 150 నుండి 200 కు మించడం లేదని, కొలతలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
పే స్లిప్పులు ఇవ్వకపోవడంతో కూలీలు తమకు ఎంత కూలి చెల్లిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం దిగి వచ్చే విధంగా ఈనెల 30 న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నామని ఈ ధర్నాలో కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్ల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశాశం లో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కట్ట అంజయ్య, గోలి నరసింహ, పద్మ, రాజు, వెంకటమ్మ, రాములు, సరస్వతి, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.