— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ : భవిత కేంద్రాలలో యాక్టివిటీ రూంకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
బుధవారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న భవిత కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భవిత కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస మౌలిక వసతులను ఆమె తనిఖీ చేశారు. ర్యాంపు, టాయిలెట్స్, రూమ్ ల తో పాటు, పరికరాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ అన్ని కేంద్రాలలో యాక్టివిటీ రూమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
సాధ్యమైనంత త్వరగా యాక్టివిటీ రూము తోపాటు, భవిత కేంద్రాలలో చేపట్టిన నిర్మాణాలను పూర్తిచేయాలని అన్నారు. విభిన్న సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు భవిత కేంద్రాలకు వస్తున్నందున వారూ సులభంగా కేంద్రంలోకి వచ్చే విధంగా ఎలాంటి అడ్డంకి లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, ప్రత్యేకించి ఈ అంశంపై ఇంజనీరింగ్ అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డిఓ రమణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఏ ఈ లష్కర్, తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి ,ఎంఈఓ మాతృ నాయక్, తదితరులు ఉన్నారు.