–ప్లాస్టిక్ ను నిషేధించాలి
— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
–కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రిక ఆవిష్కరణ
Environmental Protection : ప్రజాదీవెన నల్గొండ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. కాలుష్యం వల్ల కలిగే అనర్ధాలు, పర్యావరణ పరిరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 5 న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ బుధవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. వివిధ రకాల కాలుష్యాల వల్ల ప్రతి నిత్యం సమాజం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నదని, అందువల్ల అన్ని రకాల కాలుష్యాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాయు, జల, శబ్ద, భూమి, ప్లాస్టిక్ వంటి ఎన్నో హానికర కాలుష్యాలు సమాజంలో విచ్చలవిడిగా ఉన్నాయని, ఇవి పర్యావరణంతో పాటు, జీవ, జంతు జాలాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని తెలిపారు.
వీటి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ప్లాస్టిక్ స్థానంలో పేపర్, గుడ్డ కు సంబంధించిన పరికరాలు వాడాలని, స్టీల్ బాటిళ్లు, టిఫిన్ బాక్సులు, క్లాత్ బ్యాగుల వంటివి ఉపయోగించాలని కోరారు. పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లోకి, చెరువులోకి వదల వద్దని, నదులు చెరువులను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నదులే దేశానికి జీవనాడులని అన్నారు. అలాగే వాయుకాలుష్యం లేకుండా, శబ్ద కాలుష్యం లేకుండా చూసుకోవాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారం వేయడం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి నల్గొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకన్న,
సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.