— రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
–మదీనా మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి
Minister Komatireddy Venkata Reddy : ప్రజాదీవెన , నల్గొండ : మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మదీనా మసీదులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మదీన మజీద్ ర్యాంప్ ఆభివృద్ధికి అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్ష పదవిని ముస్లింలకే ఇస్తున్నామని, దేవరకొండ రోడ్ లో 50 ఎకరాల స్థలంలో 2200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామని, ఇక్కడ పేద వారికి ఇళ్లను ఇవ్వనున్నామని, అందులో ముస్లింలకు కూడా ఇండ్లు ఇస్తామని తెలిపారు. ఎంతోమంది ముస్లిం ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయంతో పాటు, మున్సిపాలిటీ తదితర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నారని, ముస్లింలు వారికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు తనకు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన కోరారు. 140 కోట్ల రూపాయలతో లతీఫ్ గుట్టకు డబుల్ రోడ్డును వేసేందుకు టెండర్లను పిలవడం జరిగిందని, ఏప్రిల్ 3 ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని, లతీఫ్ సాబ్ గుట్ట నుండి బ్రహ్మం గారి గుట్ట ను కలుపుతూ రోప్ వే ఏర్పాటుతో పాటు, టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు మంజూరూ అయ్యిందని మంత్రి తెలిపారు.
క్లాక్ టవర్ నుండి బస్టాండ్ రోడ్డును అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా ఆర్డీవో కార్యాలయం నుండి మిర్యాలగూడ రోడ్డును పూర్తి చేస్తామని, ఇందులో భాగంగా డిఈఓ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు డబుల్ రోడ్డు ను పూర్తిగా తీర్చిదిద్దడం జరిగిందని ఆయన తెలిపారు.అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మదీన మజీద్ పెద్దలు మౌలానా తదితరులు ఉన్నారు.