Kishan reddy: మోదీకి ప్రత్యామ్నాయం లేదు
ప్రతిపక్ష పార్టీల్లో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడే లేరని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.
ఒక్క రోజు సెలవు లేకుండా దేశం కోసం పనిచేస్తున్నారు: కిషన్ రెడ్డి
మరోసారి మోదీని ప్రధానిగా గెలిపిద్దాం
బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకున్నది
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో మోసం చేసింది
ఈ రెండు పార్టీలకు ఓటు వేయడం వృథా
అంబర్ పేట జీప్ యాత్రలో కేంద్ర మంత్రి కామెంట్స్
ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల్లో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడే లేరని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గత పదేండ్లుగా మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేశారని, అలాంటి నాయకుడిని మరోసారి ప్రధానిగా గెలిపించుకుం దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన అంబర్ పేట నియోజకవర్గంలో జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన మోదీ.. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ఉచిత బియ్యం పంపినీ చేస్తున్నారని తెలిపారు.
‘‘మూడేండ్ల కిందట మొదలైన ఉచిత బియ్యం పంపిణీ మరో ఐదేండ్ల పాటు కొనసాగించనున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. నిరు పేద కుటుంబంలో టాయిలెట్ నుంచి చంద్రయాన్ వరకు భారత్ ఎన్నో విజయాలు సాధించింది. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం లేరు. ఏ ఇంట్లో చూసినా.. ఎవరి నోట విన్నా ఒక్కటే మాట మోదీ.. మోదీ అని’’ ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే..
మోదీ పాలనలో దేశంలో మాఫీయా, గూండాయిజం లేదని, కర్ఫ్యూలు, అలర్లు లేవని, దేశం శాంతియుతంగా ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశం మోదీ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందన్నారు. ‘‘మోదీ ప్రధాని అయినప్పుడే.. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మొత్తం ఫాం హౌజ్లోనే ఉన్నారు..ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు.
అందుకే ఆయనను రాష్ట్ర ప్రజలు ఫామ్ హౌస్ కే పరిమితం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది. మహిళలకు రూ.2500 రావడం లేదు. నిరుద్యోగులకు భృతి రావడం లేదు. కొత్త రేషన్ కార్డులు రాలేదు. కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు.. పెంచుతానని హామీ ఇచ్చిన పెన్షన్ల పెంపు లేదు. ఈ రెండు పార్టీలు ఒకటే.. వీటికి ఓటు వేస్తే వృథా. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపర్చండి, సికింద్రాబాద్ ఎంపీగా నన్ను ఆశీర్వదించండి”అని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.
Modi no alternative leader