ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 18వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం, పని భద్రత హామీలను అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆద్వర్యంలో డిసెంబరు 15 నుండి 31 వరకు జరిగే రాష్ట్ర వ్యాప్త బస్సు జాతాను జయప్రదం చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్( సిఐటియు) జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి, టి వెంకటమ్మలు కోరారు.గురువారం ఆశ బస్సు జాత పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 వేల మంది ఆశా వర్కర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఆరోగ్య వారధిలా పనిచేస్తున్నారన్నారు.
వీరు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్య సూచనలు, సలహాలు ఇస్తూ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. వీరికి ప్రభుత్వం వేతనాలు ఇవ్వకుండా పారితోషికాల పేరిట వీరి శ్రమను కారు చౌకగా దోపిడీ చేస్తుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆరోగ్య వ్యవస్థకు మూల స్తంభాలుగా పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వీరికి ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లిస్తూ పని భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, అధికారుల వేధింపులు అరికట్టాలని, సమాజంలో గౌరవప్రదమైన జీవితం జీవించడానికి ఆశలకు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని తదితర సమస్యలను పరిష్కారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు జాత ఈనెల 24న దేవరకొండ, 25న నల్గొండ కు చేరుకుంటుందని
ఈ సందర్భంగా జరిగే సభలు ర్యాలీలలో జిల్లా ఆశా వర్కర్లంతా ఈ జాతా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా నాయకులు పోలె సత్యనారాయణ ఆశ యూనియన్ నాయకులు ప్రేమలత, సిహెచ్ వీరభద్రమ్మ, ఏ సౌజన్య, సి శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.