ప్రజాదీవెన, నల్గొండ బ్యూరో :విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన చింతపల్లి ఎంపీడీవో కు సోకాజ్ నోటీసు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పకడ్ఢబంధిగా చేయాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహించడం, కిందిస్థాయి సిబ్బందికి యాప్ వివరాల నమోదుపై అవగాహన కల్పించనందుకు గాను నల్గొండ జిల్లా, చింతపల్లి ఎంపీడీవో సుజాతకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ చింతపల్లి మండలం, ఘాసిరాం తండా, నసర్లపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.ముందుగా జిల్లా కలెక్టర్ మండలంలోని ఘాసిరాం తండాలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారు ఇండ్ల కు వెళ్లి సర్వే బృందం యాప్ లో నమోదు చేసిన వివరాలను సెల్ఫోన్ ద్వారా పరిశీలించారు. రమావత్ శంకర్, కోర్ర సరిత తదితర దరఖాస్తుదారుల ఇళ్లను పరిశీలించి అక్కడ వివరాల నమోదు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ దరఖాసుదారుల ఇంటితో సహా తీసుకున్న ఫోటో, అలాగే ఇంటి ధృవపత్రాల అప్లోడింగ్ వివరాలను అడగగా, ఫోటో అప్లోడ్ చేయకపోవడం, ధ్రువపత్రాలు లేక తాత్కాలిక అప్లోడ్ చేయడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సిబ్బందికి యాప్ పరిశీలనపై ముందే అవగాహన ఎందుకు కల్పించలేదని, సర్వే పై గ్రామంలో ముందే ప్రజలకు చెప్పకపోవడం పై ఎంపిడిఓపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటిస్ జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు సర్వే బృందాలు వచ్చినప్పుడు గ్రామాలలో తప్పనిసరిగా దరఖాస్తు దారు ఇంటి వద్ద ఉండాలని, ఇంటి ముందు నిలబడి ఫోటోతో సహా యాప్ లో అప్లోడ్ చేసేలా ఫోటో దిగాలని, అంతేకాక ఇంటికి సంబంధించిన ధ్రువపత్రాలు, ఆధార్ తదితర దృవపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని పునరుద్ఘాటించారు. సర్వే బృందాలకు ఏ రోజు సర్వే నిర్వహించే ఇండ్ల దరఖాస్తుల వివరాల డాటాను మాత్రమే అప్లోడ్ చేయాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్ ను ఆదేశించారు. మాస్టర్ డేటాను సర్వే బృందాలకు ఇవ్వడం వల్ల వారు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంటుందని, అందువల్ల సంబంధిత గ్రామానికి సంబంధించి ,ఆ రోజు సర్వే నిర్వహించే ఇళ్లకు సంబంధించిన వివరాలు మాత్రమే ఆరోజు అప్లోడ్ చేయాలన్నారు.గతంలో ఏదైనా కారణం చేత ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా దరఖాస్తు చేసుకో లేకపోయిన వారు ఇప్పుడు ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన మీ-సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం నసర్లపల్లి గ్రామంలో సైతం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే ను పరిశీలించారు. దరఖాస్తు దారు లక్ష్మమ్మ ఇంటికి వెళ్లి ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లా? ఆర్ సి సి న లేక పెంకుటిళ్ల అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే బృందం వచ్చినపుడు లక్ష్మమ్మ అందుబాటులో లేకపోవడంతో ఆమెను పిలిపించి ఫోటో దింపాలని సర్వే బృందానికి సూచించారు. ఇందిరమ్మండ్ల దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు.అలాగే అధికారులు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, సిబ్బంది దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన సందేహాలను ఈ నెంబర్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, సర్వే బృందాలు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నాయి.