–ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
–రైతులందరూ వీక్షించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి
–రైతులతో నేరుగా మాట్లాడానున్న సీఎం
–ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దు
–కలెక్టర్ ఇలా త్రిపాఠి
–తహసిల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశం
ప్రజాదీవెన, నల్గొండ:
District Collector Ila Tripathi: ఆధునిక పంటల సాగు, పంటల యాజమాన్య పద్ధతులు, నూతన సాంకేతికత ద్వారా వ్యవసాయ సాగు, తదితర అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు ఎప్పటికప్పుడు అందించే సూచనలు, సలహాలు, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై రైతులకు తెలియజేసేందుకు గాను ఈనెల 16 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని జిల్లాలోని రైతులందరూ వీక్షించి సద్వినియోగం చేసుకునే విధంగా రైతు వేదికలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాట్ల విషయమై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
నల్గొండ జిల్లాలో 140 రైతు వేదికలు ఉండగా, ప్రస్తుతం 32 రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ విధానం అందుబాటులో ఉందని, ఈనెల 16 న మరో 62 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ విధానం ప్రారంభం కానుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు నేస్తం ద్వారా అందించే సూచనలు, సలహాలను రైతులందరూ విని సద్వినియోగం చేసుకునే విధంగా రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం తోపాటు, అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని, మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా రైతు వేదికల పరిధిలోని రైతులు కనీసం 250 మంది సిద్ధంగా ఉండేలా జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి రైతు వేదికను పండగ వాతావరణంలో మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులు, పూలతో అలంకరించాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఏ రైతు వేదిక లో ఉన్న రైతులతోనైనా ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉన్నందున ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రతి రైతు వేదికలో తప్పనిసరిగా మండల స్థాయి అధికారి హాజరుకావాలని, జిల్లా వ్యవసాయ అధికారి, సంబంధిత మండల ప్రత్యేక అధికారులతో కలిసి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
తహసిల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయ, మండల విద్యాధికారులు అందుబాటులో ఉండాలని చెప్పారు. అదనపు కలెక్టర్ లు, ఆర్డీవోలు, వారికి అందుబాటులో ఉన్న రైతు వేదిక లో రైతు నేస్తం కార్యక్రమానికి హాజరు కావాలని, తను ఒక రైతు వేదికలో హాజరవుతానని కలెక్టర్ తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు ఆహ్వానించాలని చెప్పారు. రైతులు 16 న నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.