Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi: పద్మ పురస్కారాలకు దరఖాస్తు చేసుకొండి

— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

–అర్హులైన వారు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన

— ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే వారు అర్హులు కారని వెల్లడి

ప్రజాదీవెన, నల్గొండ:

District Collector Ila Tripathi: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటని, ఈ అవార్డులను 1954 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని, ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు.

కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు మొదలైన రంగాలలో విశిష్ట సేవలు అందించి విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తారని ఆమె తెలిపారు. జాతి, వృత్తి, లింగ బేధం లేకుండా అందరూ ఈ అవార్డులకు అర్హులని, 2026 సంవత్సరానికి ఇచ్చే ఈ పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులను రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా స్వీకరించబడతాయని వెల్లడించారు.

నామినేషన్లను 31 జూలై 2025 లోగా పైన పేర్కొన్న పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫార్మాట్‌లో, గరిష్టంగా 800 పదాలకు మించకుండా వివరణాత్మక కథనం రూపంలో పంపించాలని తెలిపారు. అవార్డ్ కు ప్రతిపాదిస్తున్న వ్యక్తి విశిష్టమైన, అత్యుత్తమ సేవ, కృషిని స్పష్టంగా తెలియజేయాలని, ఆన్‌లైన్లో నామినేషన్లు పంపడానికి అవసరమైన సూచనలు https://awards.gov.in పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని, అలాగే నియమ నిబంధనలు పద్మ అవార్డుల వెబ్‌సైట్: https://padmaawards.gov.in లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

నామినేషన్ల ఖరారు సమయంలో ప్రతిపాదిత వ్యక్తులు జీవితకాలం పాటు చేసిన కృషికి అత్యంత ప్రశంసనీయులని నిర్ధారించే అంశాలు, సమాజానికి వారి సేవ, సాధనలలోని గొప్పతనం పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పద్మ అవార్డు దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయినందున రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో లేదా వారి సంబంధిత రంగంలో ఇప్పటికే ఏదైనా అవార్డు పొందిన వ్యక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, సమాజంలోని బలహీన వర్గాలైన మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు మొదలైన వారిలో ప్రతిభావంతులను గుర్తించడానికి ఇది ఒక మంచి అవకాశం అని పేర్కొన్నారు.

డాక్టర్లు, శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసేవారు పద్మ అవార్డులకు అర్హులు కారని తెలిపారు. జిల్లాలో పైన పేర్కొన్న రంగాలలో అత్యున్నత, విశిష్ట సేవలు అందించిన వారు 31జూలై , 2025 లోగా రాష్ట్రపతి పురస్కార్ పోర్టల్ https://awards.gov.in ద్వారా పద్మ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని, ముఖ్యంగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, దివ్యాంగుల లో ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.