Collector Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కృషి తోనే లక్ష్యాన్ని సాధించవచ్చని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి (Narayana Reddy)అన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చదువుకుంటే ఉన్నత స్థానాన్ని పొందవచ్చు అని ఆయన విద్యార్థులకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న కనగల్ మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల గ్రౌండ్, ఆట స్థలాన్ని, హాస్టల్ ను ,తరగతి గదులను, కిచెన్, టాయిలెట్స్, స్టోర్ రూమ్ లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల గ్రౌండ్ లో ఆటలాడుతున్న విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి (interacted) ఎలాంటి ఆటలాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు.
తర్వాత పదవ తరగతి (tenth class) గదిలోకి వెళ్లి విద్యార్థులతో తెలుగు, ఇంగ్లీష్, సోషల్ సబ్జెక్టుల పై వివిధ రకాల అంశాలపై ప్రశ్నలు, జవాబులు అడిగారు. తెలుగు (Telugu) సబ్జెక్టును విద్యార్థులచే చదివించడమే కాకుండా, వాటికి అర్థాలను, వివరాలను అడిగారు. సాంఘికశాస్త్రం లో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం(Telangana Prajapalana Day) గురించి మీకు తెలుసా..? అని కలెక్టర్ అడగగా, విద్యార్థులు తెలుసునని సమాధానాలు చెప్పారు.
అలాగే రాజ్యాంగం అంటే ఏమిటి ..?దాని అర్థం..? అడగగా హక్కులు, బాధ్యతలు చట్టాలు, ప్రభుత్వాల వంటి వివరాలు రాజ్యాంగంలో ఉంటాయని విద్యార్థులు సమాధానం ఇవ్వగా.. ప్రభుత్వాలు ఎన్ని రకాలని..? రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉంటాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులు ఒక్కొక్కరిని లేపి జీవితంలో ఏమి కావాలని అనుకుంటున్నారని అడిగారు. అలాగే జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలపై అడగగా.. టీచర్, డాక్టర్, లాయర్, బిజినెస్ మెన్ అవుతామని విద్యార్థులు తెలిపారు.
అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కష్టపడి చదువుకోవాలని, ఏదైనా సాధించేందుకు కృషి ఒక్కటే మార్గం అన్న విషయాన్ని మరువద్దని కలెక్టర్ తెలిపారు. చదువుతోపాటు, మానవతా విలువలు సైతం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. హాస్టల్ స్టోర్ రూమ్, కిచెన్ ను ఆయన తనిఖీ చేసి సరుకులన్నీ వస్తున్నాయా..? శుక్రవారం నాటి మెనూ ఏమిటని ప్రిన్సిపల్ బిక్షమయ్యను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం విద్యార్థులకు మెనూ ప్రకారం చికెన్ ఇస్తున్నామని ప్రధానోపాద్యులు తెలిపారు.
డైనింగ్ , డార్మెటరీని, బాత్రూం లు పరిశీలించి అన్నిటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రయివేట్ భవనమైనందున టాయిలెట్లకు ఇబ్బందిగా ఉందని ప్రిన్సిపల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పాఠశాల గ్రౌండ్, ఇతర అన్ని అంశాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంట మహాత్మ జ్యోతిబాపూలే కనగల్, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్, స్పెషల్ ఆఫీసర్ బిక్షమయ్య ఉన్నారు.