Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy: ఆణిముత్యాలు లాంటి పౌరులను తయారు చేయాలి

— ఉపాధ్యాయులు దేవుళ్ళుగా మారాల్సిన అవసరం ఉంది
–ఉపాధ్యాయులు పట్టుదలతో పని చేస్తే సమాజానికి ఊతం
–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజలను తీర్చిదిద్దేందుకు దేవుడు టీచర్లను సృష్టించాడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గండమోని మైసయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువులు దేవునితో సమానమని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి అన్నారు. తనకు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని చెప్పారు.

అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు కనిపిస్తున్నాయని, కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని ,ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు టీచర్లు తమ సొంత పిల్లలను చదివించినట్లుగానే విద్యార్థులను , చదివించాలని ,టీచర్లు పట్టదలతో పనిచేస్తే సమాజానికి ఆణిముత్యాల లాంటి పౌరులను తయారు చేయవచ్చని అన్నారు. రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు జిల్లా ఉపాధ్యాయులు (Teachers) కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యావ్యవస్థ అభివృద్ధికి తనవంతు కృషిలో భాగంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాల తో పాటు ,ఇటీవల బొట్టు గూడ పాఠశాలను ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ నిధులతో నూతన భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన కవి, రచయిత, రాజ్యసభ సభ్యులు (Poet, Writer, Member of Rajya Sabha) కోడూరి విశ్వవిజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల నమ్మకాన్ని కలిగించే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులుగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు.”నేను నుండి మన” అనే మనస్తత్వాన్ని విద్యార్థుల్లో కల్పించాలని, అలాంటి సంస్కృతి ,సంప్రదాయాలను విద్యార్థులకు నేర్పించాలని చెప్పారు. ఢిల్లీలో పబ్లిక్ పాఠశాలల్లో (Public school)సీట్లు దొరకటం లేదని, అన్ని ప్రాంతాలలో ఆ విధమైన పరిస్థితిని ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందుర్ రఘువీర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దీటుగా తీర్చిదిద్దాలని, ఇందుకు సామాజిక బాధ్యతగా పనిచేసి ప్రైవేట్ మాదిరిగానే డిజిటల్ విద్య వ్యవస్థకు కృషి చేయాలని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని కోరారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy)మాట్లాడుతూ విద్యకు సాధికారత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు పనిచేయాలని, ప్రభుత్వ కృషికి ఉపాధ్యాయులు సైతం సహకరించాలని కోరారు.నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ తెలంగాణ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ,విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ మాట్లాడుతూ ప్రపంచాన్ని నిర్మించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని, ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడుతున్నాయో ఉపాధ్యాయులు ఆలోచించాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలకు తగ్గట్టుగా బోధనా పద్ధతులు మారాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్య ఒక సాధనమని, విద్యావ్యవస్థలో కృత్యాధార పద్ధతికి ప్రాధాన్యత ఇవ్వాలని, చెడు మార్గం వైపు పయనిస్తున్న యువతను విద్య ద్వారా మళ్ళించాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి స్వాగతోపన్యాసం చేశారు .మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, టీ పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,ఆర్డిఓ రవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలు, పూలమాలలతో సత్కరించారు .కార్యక్రమం ప్రారంభమైన వెంటనే మంత్రి తోపాటు,అతిథులందరు ఉపాధ్యాయుదు, భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.