–రోడ్ల నిర్మాణంలో నాణ్యత పై రాజీ పడేది లేదు
–సమీక్ష సమావేశంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
ప్రజా దీవెన, మునుగోడు:
Komatireddy Raj Gopal Reddy: మునుగోడు నియోజకవర్గంలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రోడ్ల పనుల పు రోగతిపై మునుగోడు లోని అధికారిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.
సాగర్ రోడ్డు నుండి ముష్టిపల్లి వరకు, ముష్టిపల్లి నుండి నాంపల్లి వరకు జరుగుతున్న ఆర్ అండ్ బి రోడ్ల పనులు ఎంతవరకు వచ్చాయని కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలని నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. వీటితోపాటు అంగడిపేట నుండి లెంకలపల్లి వరకు చేపట్టబోయే రోడ్డు పనులకు సంబంధించి టెండర్ ప్రొసీజర్ ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. నాంపల్లి నుండి ఇడికుడ వరకు, ఇడికుడ నుండి కమ్మగూడెం(తెరట్ పల్లి) వరకు ఉన్న పంచాయతీరాజ్ రోడ్లను ఆర్ అండ్ బి రోడ్లుగా మార్చిన తర్వాత వాటి పనులకు సంబంధించి పురోగతి పై ఆరా తీశారు. వీటితోపాటు నియోజకవర్గంలో HAM(Hybrid Annuity Model) కింద ఎన్ని రోడ్లకు ప్రపోజల్స్ పంపించారనే విషయాలపై చర్చించారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పిఆర్ రోడ్ల పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించారు… ప్రస్తుతం జరుగుతున్న 57 రోడ్ల పనులు ఎంతవరకు వచ్చాయి ఎప్పటి వరకు పూర్తవుతాయని ఆరా తీశారు. ఇవే కాకుండా మరో 34 పి ఆర్ రోడ్లు టెండరింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న 89 రోడ్డు పనుల ప్రోగ్రెస్ పై ఫోకస్ పెట్టి ప్రతిరోడ్డు 5.5 మీటర్లు వెడల్పుతో నాణ్యతతో నిర్మించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పిఆర్ రోడ్డు 3.75 మీటర్ల నుండి 5.5 మీటర్ల వెడల్పుకి మార్చాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఏ రోడ్డును చూసినా కూడా 5.5 మీటర్ల వెడల్పుతో ఉండాలని సూచించారు. విడతల వారీగా నియోజకవర్గంలోని అన్ని రోడ్లను నిర్మాణం చేసుకోవాలన్నారు.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం కోసం, ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తెప్పించే బాధ్యత నాదని, నాణ్యత రోడ్ల నిర్మాణం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లతోపాటు, పంచాయతీరాజ్ ఈ ఈ గిరిధర్, ఆర్ అండ్ బి మునుగోడు డి ఈ శరత్ చంద్ర, పి ఆర్ ఎ ఈ సతీష్ తదితరులు పాల్గొన్నారు.