ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : యాత్ర చరిత్రలు మానవ జాతి సంస్కృతికి నిదర్శనమని తెలంగాణ సీనియర్ సాహితీవేత్త మేరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. సోమవారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ‘అడవిలో అన్వేషణ’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యాదగిరిరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్లి ఆ అనుభవాలను ఒక పుస్తకంగా తీసుకు రావడం వల్ల మన చరిత్రను మనం నమోదు చేసినట్టు అవుతుందని అన్నారు. విద్యార్థి దశ నుంచే విజ్ఞాన యాత్ర అనుభవాలు రాయడం వలన భవిష్యత్తులో రచయితలుగా ఎదిగే అవకాశం ఉందని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విజ్ఞాన యాత్ర అనుభవాలను ఇలా పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని పి. జి. విద్యార్థులను అభినoదించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన డా. తoడు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ విద్యార్థుల వ్యాస రచనా నైపుణ్యాన్ని కొనియాడారు. పుస్తకాల్లో చదివిన విజ్ఞానం కంటే క్షేత్ర పర్యటనల ద్వారా నేర్చుకునే జ్ఞానం ఎప్పటికీ మన వెంటే ఉంటుందని అన్నారు.
తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్ మాట్లాడుతూ అడవిలో అన్వేషణ పుస్తకం రూపంలో చిన్నదైనా సారంలో గొప్పదని అన్నారు. ప్రతియేటా విద్యార్థులు చేసే క్షేత్రపర్యటన విశేషాలకు అక్షర రూపం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో తెలుగుశాఖ అధ్యాపకులు డా. టి. సైదులు, గోవర్ధనగిరి, డా. జానయ్య, ప్రభాకర్, శ్రవణ్ కుమార్, అంజయ్య, లింగస్వామీ, పి. జి. తెలుగు విద్యార్థులు శ్రవణ్, ఏడుకొండలు, గంగాభవాని, స్రవంతితో పాటు ఇతర విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.