–జిల్లా అధికారులతో టెలికాన్ఫ రెన్సులో కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy)అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్సు (Teleconference నిర్వహించారు . జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికారులందరూ కార్యాస్థానంలోనే ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా గైర్హాజరైనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకుగాను ముఖ్యమైన కార్యాలయాలైన జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు ,ట్రాన్స్కో, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్,మున్సిపల్, మండల కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, 24 గంటలు పని చేసే విధంగా సిబ్బందిని నియమించి 3 షిఫ్టులు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను ప్రజలకు తెలిసే విధంగా మీడియా ద్వారా సమాచారం అందించాలని ఆదేశించారు.
ఎట్టి పరిస్థితులలో ప్రజల ప్రాణాలకు హాని జరగకూడదని ,ప్రత్యేకించి నదులు, వాగులు, వంకలలో ఎవరు కొట్టుకుపోకుండా చూడాలని, అదేవిధంగా ఇండ్లుపడిపోవడం కారణంగా చనిపోవడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోవడం లాంటివి జరగడానికి వీలు లేదని తెలిపారు. భారీ వర్షాల ను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండేలా గ్రామాలలో టామ్ టామ్ టామ్ వేయించాలని ,మట్టి మిద్దెలు, పాతబడిన ఇండ్లు వర్షం కారణంగా తడిసి పడిపోయేందుకు కూలిపోయేందుకు అవకాశం ఉందని అలాంటి ఇళ్లలో నుండి ప్రజలను ముందే ఖాళీ చేయించి గ్రామంలోని పాఠశాలలు, గ్రామపంచాయతీ భవనం ఇతర సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు ముందే వారి పరిధిలోని ఇళ్లను తిరిగి చూసి అలాంటి వారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటు చేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామంలోనే ఉండాలని, గ్రామంలో తలెత్తే పారిశుద్ధ్య సమస్యలు, ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చాలని ఆదేశించారు .
ఎక్కడైనా వాగులు, వంకలు (Streams, bends)పొంగిపొర్లుతున్నట్లయితే ప్రజలు వాటిని దాటే సాహసం చేయకుండా నిలువరించాలని, అలాగే అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, ఆ దారి గుండా ప్రయాణించకుండా ట్రాఫిక్ ని మళ్లించడం, లేదా వరద ఉధృతి తగ్గిన తర్వాత వెళ్లేలా ఏర్పాటు చేయాలన్నారు. వర్షం కారణంగా ట్రాన్స్ఫార్మర్లు ,విద్యుత్ స్తంభాలకు ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉన్నందున మనుషులు, పశువులు వాటికి దగ్గరగా వెళ్లకుండా విద్యుత్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ,ఎక్కడైనా చెట్లు పడిపోయి విద్యుత్ వైర్లు తెగిపోయిన, లేదా చెట్లు పడిపోయిన వెంటనే వాటిని తొలగించే విధంగా మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వర్షాల వల్ల తెగిపోయేందుకు, గండ్లు పడేందుకు ఆస్కారం ఉన్న చెరువులు, కుంటలను లస్కర్ల ద్వారా ముందే గుర్తించి పటిష్టం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రైతులు పంటలు నష్టపోకుండా వ్యవసాయ అధికారులు మండలాలలో ముందస్తు సూచనలు, సలహాలు చేయాలన్నారు. గ్రామాలలో నీరు నిల్వ (Water storage)ఉండకుండా చర్యలు తీసుకోవాలని ,పారిశుద్యం పై (Sanitation) ఇంకా ఎక్కువ దృష్టి కేంద్రీకరించి నిరంతరం పారిశుధ్య చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. వసతి గృహాలలో (In dormitories) ప్రత్యేకించి కేజీబీవీలు, మోడల్ స్కూల్ లలో వార్డెన్లు హాస్టల్లోనే ఉండాలని, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రక్షిత మంచినీటితో పాటు, ఆహారం కలుషితం కాకుండా చూడాలని చెప్పారు. అలాగే అన్ని వసతి గృహాలలో వార్డెన్లు హాస్టల్లోనే ఉండాలని, శానిటేషన్ తో పాటు, డ్రింకింగ్ వాటర్, భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు .వర్షాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఎక్కడైనా అవసరమైన చోట పాఠశాలకు సెలవులు ప్రకటించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశిం చారు.ఈ టెలి కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర, ఆదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిపి ఓ మురళి, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఆర్డిఓ రవి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు మాట్లాడారు