–నాలుగు నెలలుగా వేతనాలు లేక మెడికల్ కళాశాల ఔట్సోర్సింగ్ సిబ్బంది వెతలు
— జీతాలు ఇప్పించాలని గత సోమవారమే ఆదేశించిన కలెక్టర్
— ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీ
— పట్టించుకోని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
ప్రజాదీవెన నల్గొండ బ్యూరో:
Nalgonda Medical College: గత నాలుగు నెలలుగా వేతనాలు లేక నల్లగొండ మెడికల్ కళాశాలలో పని చేస్తున్న 40 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. తమకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 9వ తేదీన ఉద్యోగులు అంత జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వేడుకోగా స్పందించిన ఆమె మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసి రెండు రోజుల్లో వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి వారం రోజులు కావస్తున్న సిబ్బందికి ఒక్క నెల వేతనాన్ని కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ చెల్లించలేదు. నల్లగొండ మెడికల్ కళాశాలలో ఏ వన్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఒక సూపర్వైజర్, 18 మంది సెక్యూరిటీ గార్డులు, 21 మంది స్వీపర్లు ఉన్నారు. ఫిబ్రవరి మాసం నుండి మే వరకు వీరికి వేతనాలు అందడం లేదు.
ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ ప్రీమియంలు కూడా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తమ కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందిగా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా తమ ఇబ్బందులను గమనించి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
అయితే నేటి ప్రజావాణిలో మళ్ళీ అదే సమస్యపై కలెక్టర్ ను కలిసేందుకు ఔట్సోర్సింగ్ సిబ్బంది సిద్ధమయ్యారు. గత వారమే మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడిన కలెక్టర్ వెంటనే జీతాలు ఇప్పించాలని, సిబ్బంది నుండి ఎలాంటి ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ చెప్పినా నేటికీ ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో వారు తిరిగి కలెక్టర్ ను కలవనున్నారు. అయితే ఈసారి కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకొని సిబ్బందికి ఎలా న్యాయం చేస్తారో వేచి చూద్దాం.