–ప్రజా సంఘాల నేతలు
–శాంతి చర్చలు ప్రారంభించాలని డిమాండ్
–జూన్ 17 మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
–ప్రజా సంఘాల నేతలు
ప్రజాదీవెన నల్గొండ
Operation Kagar: ఆపరేషన్ కగార్ పేరుతో మోడీ ప్రభుత్వం గత 17 నెలల కాలం నుండి అత్యంత దుర్మార్గంగా మావోయిస్టులు, ఆదివాసీలపై యుద్ధం చేస్తూ బూటకపు ఎన్ కౌంటర్ల పేరుతో 541 మందికి పైగా హత్య చేసిందని తక్షణమే శాంతి చర్చలు జరపాలని, యుద్ద ప్రక్రియను నిలిపివేయాలని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈనెల 17న హైదరాబాదులో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నా పోస్టర్ ను నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇందూరి సాగర్,పందుల సైదులు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్నికి, చట్టాలకు తిలోదకాలిస్తూ ఆదివాసులు, మావోయిస్టులపై హత్యాకాండను కొనసాగిస్తూ నరమేధాన్ని సృష్టిస్తుందని అన్నారు.
విదేశీ, బహుళ జాతి, కార్పోరేట్ సంస్థలకు అటవీ సంపదను అప్ప చెప్పుటకు కుట్ర పన్నుతూ ఆదివాసీలపై, మావోయిస్టులపై హింసకు పాల్పడుతుందని అన్నారు.మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ను చంపిన మరసటి రోజున రెండున్నర వేల ఎకరాల భూములను, చెట్లను ఆదానికి అప్పజెప్పడంతోనే బిజెపి ప్రభుత్వం ఎవరి కోసం ఈ మారణకాండ కొనసాగిస్తుందో ఈ దేశ ప్రజలకు అర్థమైందన్నారు.
ఆదివాసీలకు గిరిజనులకు ఉన్నటువంటి చట్టబద్ధహక్కులైన 1/70, పిసా చట్టం,అటవీ సంరక్షణ చట్టాలను కాలరాస్తూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని, ఈ దేశ ప్రజలను సంపుక తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.శత్రు దేశంతో చర్చలు జరుపుతున్నప్పుడు స్వదేశీ పౌరులతో చర్చలు జరపడానికి అభ్యంతరం ఏమిటన్నారు.
కేంద్రం తక్షణమే యుద్ధాన్ని నిలిపివేసి, ఆదివాసీలు, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు., రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన నిబంధనలు మోడీ ప్రభుత్వం అనుసరించేటట్లుగా ఒత్తిడి తీసుకురావడానికి మావోయిస్టులతో శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని, ఈ దేశ సంపదను, ఆదివాసీల ను కాపాడుకునే దిశగా ఈనెల 17 న హైదరాబాదులో జరిగే మహా ధర్నాకు పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యావంతులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కె.పర్వతాలు తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, ప్రజాపంట్ జిల్లా కన్వీనర్ సిహెచ్ సుధాకర్ రెడ్డి, టీజేఏసీ జిల్లా నాయకులు తోట నరసింహ చారి, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షం, రైతాంగ ప్రతిఘటన వేదిక కన్వీనర్ గూడూరు జానకిరామ్ రెడ్డి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు బొంగరాల నరసింహ, పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, చింతల విజయ్ కుమార్ గౌడ్, కొంపెల్లి రామన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.