Qaza Altaf Hussain: భారత దేశ సమగ్ర అభివృద్ధికి స్పృహ శాస్త్రీయతతో కూడిన పరిశోధనలు అవసరం ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్.
ప్రజదీవెన, నల్గొండ టౌన్ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో యువ అధ్యాపకులు మరియు పరిశోధకులకు రిసర్చ్ మెథడాలజీ పై పది రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్ర అభివృద్ధికి సామాజిక స్థితిగతులపై అవగాహన స్పృహ శాస్త్రీయమైన పరిశోధనల అవసరాన్ని గుర్తు చేశారు. అత్యధిక జనాభా వైవిద్య భరితమైన దేశ స్థితిగతుల అనుసారం పరిశోధనలు సైతం అదే స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందన్నారు.
మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను సమర్థవంతంగా పరిష్కార మార్గాలను చూపాల్సిన బాధ్యత ఉన్నత విద్యాలయాల పై ఉందన్నారు. దేశ నలుమూలల నుండి అధ్యాపకులను, పరిశోధకులను భాగస్వాములను చేయడంతో పాటు నిష్ణాతులైన ఉపన్యాసకులను ఆహ్వానించడం విశ్వవిద్యాలయానికి ఒక శుభ పరిణామం అన్నారు. అనంతరం కోర్సు కోఆర్డినేటర్ ఎం జి యు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి కార్యక్రమంలోని చర్చించబోయే అంశాలను వివరించారు. అనంతరం పరిశోధన ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆచార్య రామ్ లాల్ ఎన్ఐటి వరంగల్ ఆచార్యులు పరిశోధనా అంశాల ఎంపికలో మెలకువలు, పరిశోధన పద్ధతులపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో కోర్సు కో కోఆర్డినేటర్ డా మిర్యాల రమేష్ , కళాశాల ప్రిన్సిపాల్ డా మారం వెంకట రమణారెడ్డి, కే అరుణప్రియ, డా లక్ష్మీ ప్రభ, డా శ్వేత, డా ప్రవళిక, డా సురేష్ రెడ్డి, డా జ్యోతి, తదితర అధ్యాపకులు పరిశోధకులు పాల్గొన్నారు.