హాజరైన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రపంచ శాంతి కోసం ప్రభువైన ఏసుక్రీస్తు లోకంలో అవతరించాడని తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సియాన్ యూత్, గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ కంటాట సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. డిసెంబర్ మాసంలో క్రైస్తవులంతా గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ప్రపంచ శాంతితో పాటు సమానత్వాన్ని బోధించేందుకు క్రీస్తు ఎంతగానో పాటుపడ్డారని చెప్పారు.
నల్గొండ పట్టణంలో క్రిస్మస్ కంటాట ప్రదర్శనను నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్రైస్తవుల సమస్యల సాధన కోసం కృషి చేస్తుందని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. రాబోవు రోజులలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సియాన్ యూత్ సభ్యులకు కోరారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి పంచిపెట్టారు. వందమంది కళాకారులచే క్రిస్మస్ పర్వదినాన్ని వివరిస్తూ నిర్వహించిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టు కుంది. కార్యక్రమంలో సియాన్ యూత్ సభ్యులు ప్రేమ్, ప్రదీప్, ప్రవీణ్, ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేఖల భద్రాద్రి, పాస్టర్లు ఐజాక్ రామ్, మోజెస్, సమర్పన్ కుమార్, డేవిడ్ రాజు, క్రిస్మస్ కాంటాట సభ్యులు హిమచంద్, సురేష్ కళాకారులు పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు.