–డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలోని డీఈఓ ఆఫీస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులుఅమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి జేసీ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. తమ నేత రాహుల్ గాంధీ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. దేశ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహరించిన అమిత్ షాను ఇప్పటికైనా మంత్రి పదవి నుంచి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంతో దేశంలో పాలన నడుస్తుందని,తెలంగాణ రాష్ట్రం కూడా అంబేద్కర్ రాజ్యాంగంతోనే ఏర్పడిందని పేర్కొన్నారు.అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, అణగారిన వర్గాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడ్డారని అన్నారు.
ఆయన ఏ ఒక్క జాతికో… కులానికో నాయకుడు కాదని… అందరివాడని అన్నారు. అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదన్నారు. ఇప్పటికైనా అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, ఎండి ముంతాజ్, దుబ్బ అశోక్ సుందర్, జూలకంటి శ్రీనివాస్, కిన్నెర అంజి, సురిగి వెంకన్న, జూలకంటి సైదిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడస్వామి, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగొండ అశోక్, వజ్జ రమేష్ యాదవ్, గాలి నాగరాజు, పిల్లి రమేష్ యాదవ్, మామిడి కార్తీక్, కూసుకుంట్ల రాజిరెడ్డి, కంచర్ల ఆనంద్ రెడ్డి, పెరిక అంజయ్య, పెరిక మహేష్, వడ్డేపల్లి కాశీరాం, చింత గోపాల్, పాదం అనిల్, దాసరి శంకర్, దండంపల్లి పరశురాం, ప్రసాద్, విజయ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.