–తల్లిని హతమార్చి తానూ తనువు చాలించిన వైనం
–నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో ఘటన
Son Kills Mother: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లా, నిడమనూరు (Nidamanur) మండల కేంద్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకే కాలయముడై తల్లిని హత్య (Mother was killed) చేసిన దారుణ సంఘటన కలిచివేసింది. ఆదివారం తెల్లవారుజామున తల్లిని హతమార్చి తాను గొంతు కోసుకొని తనువు చాలించిన దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరుకు చెందిన సాయమ్మ (Sayamma), వీరయ్య దంపతులకు కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు.
అయితే చిన్న కొడుకు శివ (Shiva)కు అక్క కూతురు మేఘనతో 12 ఏళ్ల కిందట వివా హం జరిగింది. మద్యానికి బానిసైన శివ తరుచూ భార్య మేఘనతో గొడవ పడుతున్నాడు. రెండేళ్ల నుండి వీరి మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయి. కుల పెద్దలు, కుటుంబ సభ్యులు కలిసి పలుసార్లు పంచాయతీ చేసినప్పటికీ కలిసి ఉండలేక విడిపోయారు. ఆగస్ట్ 22వ తేదీన న్యాయస్థానం ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. దీంతో మేఘన తల్లిదండ్రులు మిర్యాలగూడలో ఈ నెల 24వ తేదీన ఆమెకు రెండో వివాహం చేశారు. ఆ పెళ్ళికి కుటుంబ సభ్యులు వెళ్లడంతో నిడమనూరులోని ఇంటి వద్దే తల్లి సాయమ్మ, కొడుకు శివ ఉన్నారు.
మేఘనకు రెండో వివాహం జరుగుతుండడంతో శనివారం ఆగస్ట్ 24 ఉదయం నుంచి మద్యం మత్తులో ఉన్న శివ అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి సాయమ్మ గొంతు కోశాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లికి వెళ్లి ఉదయం తిరిగి వచ్చిన మృతుని తండ్రి వీరయ్య చూసే సరికి ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలా నికి వచ్చి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లతో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల వల్లే ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.