Tripati: ప్రజా దీవెన, నల్లగొండ: ధాన్యం అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాలలో రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి (Tripati) ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ (nalgonda) సమీపంలోని ఆర్జాల బావి, ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ల వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government)ధాన్యానికి ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. తేమశాతం ఎక్కువగా లేకుంటే వెంటనే కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ముఖ్యంగా రైతులు (Farmers) ధాన్యం అమ్మిన డబ్బులు వారి ఖాతాలో రెండు రోజుల్లో జమ అయ్యేందుకు పట్టాదారు పాస్ (Pattadar Passbook) పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలు కొనుగోలు కేంద్రాల్లోనే అందజేస్తే రెండు రోజుల్లోనే వారి అకౌంట్లో నిధులు (Account Money credited) జమ చేస్తామని తెలిపారు. సన్నధాన్యానికి, దొడ్డు ధాన్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, అవసరమైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇంకా ఎక్కువ లారీలను పంపించడం జరుగుతుందని, అలాగే గోదాములలో ధాన్యం అన్లోడ్ జాప్యం జరగకుండా.. తక్షణమే అన్లోడ్ చేసుకోవాలని ఆమె మిల్లర్లతో కోరారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ధాన్యం కొనుగోలు వేగవంతంతో పాటు, ట్యాబ్ ఎంట్రీ వెంటనే పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, జిల్లా సహకార శాఖ అధికారి పత్యా నాయక్, పిఎసిఎస్ అధ్యక్షులు నాగరత్నం రాజు, తదితరులు ఉన్నారు.