Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tripathi: పీఏపల్లి లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ప్రజాదీవెన, నల్గొండ :ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులను ఆదేశించారు.గురువారం ఆమె నల్గొండ జిల్లా, పీఏ పల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్య కేంద్రానికి వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు, వివిధ రకాల జబ్బులతో వస్తున్న వారి వివరాలు, ప్రసవాలు, ఇతర పేషంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్లను, స్టాక్ రిజిస్టర్లు, మందులు అన్నిటిని పరిశీలించారు.

గర్భిణీ స్త్రీలకు నిర్వహించే పరీక్షలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా నెలనెలా రెగ్యులర్ గా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అదేవిధంగా చిన్న పిల్లలకు ఇచ్చే టీకాలు,వివిధ రకాల వ్యాధులతో వచ్చే ప్రజలకు సరైన వైద్య చికిత్సలు అందించాలని చెప్పారు. కాగా పీఏ పల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ లేరని తెలుసుకుని తక్షణమే డిప్యూటషన్ పై స్టాఫ్ నర్స్ ను ఏర్పాటు చేయాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. అంతేకాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోనే స్టాఫ్ నర్స్ నివాసం ఉండేలా నివాస గృహాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆమె చెప్పారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం పోతిరెడ్డిపల్లి లో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. సర్వే సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, ఇతర వివరాలను ఆమె సర్వే బృందాలను అడిగి తెలుసుకున్నారు.

సర్వేలో ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని, అలాగే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 4251442 కు ఫోన్ చేయాలని చెప్పారు .సర్వే విషయాన్ని ముందుగానే గ్రామాలలో టామ్ టామ్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లతో సహా సర్వే బృందాలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. గతంలో ఎవరైనా ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోనట్లయితే ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో ఉన్న ప్రజాపాలన మీ -సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సూచించారు. గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ రావు ,ఎం పి డి ఓ తదితరులు ఉన్నారు.