–నేడు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు సీఎం, రాష్ట్ర మంత్రులతో రైతు సదస్సు
–జిల్లాలోని 93 రైతు వేదికల పరిధిలోని రైతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి
Farmer Account Credit : ప్రజాదీవెన నల్గొండ : రైతు భరోసా లో భాగంగా రైతుల సాగు పెట్టుబడికై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విజయవంతంగా రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని నేడు ( 24న ) రాష్ట్ర సచివాలయం వద్ద నిర్వహిస్తున్న రైతు సదస్సు కార్యక్రమాన్ని జిల్లాలోని 93 రైతు వేదికల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఒక ప్రకటనలో తెలిపారు.
రైతు భరోసా లో భాగంగా నల్గొండ జిల్లాలో సోమవారం వరకు 5 లక్షల 12 వేల మంది రైతులకు, 678 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, ఇతర మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారని, అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడతారని, అందువల్ల జిల్లాలోని 93 రైతు వేదికల పరిధిలోని రైతులు సాయంత్రం 4 గంటలకే సంబంధిత రైతు వేదికలలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను ప్రతి రైతు వేదికకు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.