–వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రాయితీపై పరికరాలు
–జిల్లాకు 810 యూనిట్లు.. రూ. 1.73 కోట్ల కేటాయింపు
–దరఖాస్తుకు తక్కువ సమయం ఇవ్వడంతో రైతుల ఇబ్బందులు
–చాలా మంది అర్హులు పథకానికి దూరం
— నేటితో ముగియనున్న గడువు
–200 పైగా వచ్చిన దరఖాస్తులు
–31తో పూర్తికానున్న మొత్తం ప్రక్రియ
— వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే లబ్ధిపొందే అవకాశం
— గడువు పెంచి లబ్ధి చేకూర్చాలని రైతుల వినతి
Agricultural Mechanization : ప్రజాదీవెన , నల్గొండ : రైతులకు సాగులో ఎంతో అవసరమైన పరికరాలను రాయితీపై అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సమయం లేకపోవడంతో అర్హులైన రైతులు ఎంతో మంది ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సమయం పడుతుండడంతో ఇచ్చిన కొద్దీ రోజుల గడువు లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అందులోనూ కేవలం మహిళా రైతులే ఆర్హులని తెలపడంతో అయోమయంలో పడ్డారు. గడువు పెంచి అర్హులకు లబ్ది చేకూరేలా చూడాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
సబ్సిడీపై పరికరాలు…
వ్యవసాయదారులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు రాయితీపై అందించే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాన్ని ఈ ఏడాది నుంచి ప్రారంబించి రైతులకు అవసరమైన వివిధ రకాల పరికరాలు, యంత్రాలు 50 శాతం సప్సిడీ తో అందించేందుకు వ్యవసాయ శాఖ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కేవలం మహిళా రైతులకు మాత్రమే ఈ పథకానికి అర్హులను చేస్తోంది. దరఖాస్తు చేసేందుకు గడువు తక్కువగా ఇవ్వటం తో సర్వత్రా ఆయోమయం నెలకొంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అందిస్తోంది. సన్న, చిన్నకారు, ఇతర వర్గాలకు చెందిన మహిళా రైతులు దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేసిన మహిళా రైతులకు సబ్సిడీలో అవసరమైన వ్యవసాయ పరికరాలు సరఫరా చేస్తారు.
స్వల్ప వ్యవధిలో దరఖాస్తులు…
ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా యూనిట్లు, నిధులు మంజూరు చేసింది. ఈ నెల 24న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తూ స్వల్ప వ్యవధిలో ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. దశాబ్ద కాలంపాటు ఆగిన ఈ యాంత్రీకరణ పదకం మళ్లీ పునరుద్ధరించినప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం, కేవలం మహిళా రైతులకు మాత్రమే అవకాశం ఉండటంతో భూములున్నప్పటికీ మహిళల పేరుతో భూమి లేకపోవడంతో అరుదైన చిన్నకారు, సన్నకారు రైతులు సైతం ఈ పథకానికి దూరమవుతున్నారు. నేటికీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది రైతులు పనిముట్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
నిబంధనలతో ఇబ్బందులు…
ట్రాక్టర్ కు సంబంధించిన యంత్రాలు ఇచ్చేందుకు భూమి మహిళల పేరుతో ఉండాలని, ట్రాక్టర్ ఆర్.సి మహిళల పేరుతో ఉంటేనే దరఖాస్తు చేయాలనే నిబంధనలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిబందనలు కొంతమేర సడలిస్తూ దరఖాస్తు గడువు పెంచాలని రైతులు కోరుతున్నారు. ఇదిలాఉండగా, 2016 -17 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ శాఖలో యాంత్రీకరణ పథకాన్ని నిలిపేసింది. దీంతో పరికరాలు, సామగ్రి కొనుగోలు చేయలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు సంఘాల ప్రతినిధులు ఈ పధకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్దరించి జిల్లాల వారీగా నిధులు కేటాయించింది.నల్గొండ జిల్లాకు సంబందించి 810 యూనిట్లు, రూ.1.73 కోట్లను కేటాయిస్తూ ఈ నెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో వ్యవసాయశాఖ అదికారులు మహిళా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే వివిధ కంపెనీలకు చెందిన తయారీదారులు సంబంధిత పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. సబ్ మిషన్ ఆఫ్ సామ్ మెకనైజేషన్ పదరం కింద ఎంపికైన రైతులకు యాంకీకరణ పరికరాలు అందజేస్తారు. ప్రభుత్వం పేర్కొన్న ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 31 వరకు పూర్తి చేయాల్సి ఉంది. అయితే అర్హుల ఎంపిక కమిటీలో మండల స్థాయిలో ఎంపీడీవో, తాసిల్దార్, మండల అగ్రికల్చర్ అధికారి (ఎంఏవో) ఉన్నారు.
తీవ్ర పోటీ…
యంత్ర పరికరాల కోసం దరఖాస్తు చేసు కోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే అర్హుల ఎంపిక జిల్లా వ్యవసాయ శాఖకు కత్తి మీద సాములా మారనుంది. రాష్ట్రలో 2017 లోనే యాంత్రీకరణ పథకం ఆగిపోయింది. అప్పటి నుంచి రైతులు ప్రైవేట్ యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు అద్దె ప్రతిపాదికన వినియోగించుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం పథకాన్ని పునరుద్ధరించడంతో తీవ్రమైన పోటీ నెలకొంది.
మరోవైపు జిల్లాలో పట్టా పాసు పుస్తకాలు ఉన్న రైతులు ఎక్కువ మందే ఉన్నారు.
5.70 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా, ఎక్కువగా పురుషులకే పట్టాలు ఉన్నాయి. రాజకీయ జోక్యం లేకుండా, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
జిల్లాలో రైతులు… సాగు విస్తీర్ణం..
నల్లగొండ జిల్లాలో 560801 మంది పట్టా పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు.5.70 లక్షల సాగు జిల్లాలో అవుతుంది. ఇందులో 5.40 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తూ ఉండగా 30 వేల ఎకరాలలో ఇతర పంటలను రైతులు సాగు చేస్తున్నారు.5.60 లక్షల్లో సుమారు రెండు లక్షల మంది మహిళ రైతుల పేరున పట్టా పాస్ పుస్తకాలు కలిగి ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఫైనాన్షియల్ టైం లేదు…
నేటితోనే గడువు ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పథకాన్ని ప్రారంభించిన, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అమలు జరిగే అవకాశం ఉంది. దీనికి గల కారణం ఫైనాన్షియల్ టైం లేకపోవడమే. ప్రభుత్వం రివైండ్ చేస్తే వచ్చే జూన్, జూలైలో అమలు జరిగే అవకాశం ఉంది. అని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు
కేటాయించిన యూనిట్లు…
–బ్యాటరీ స్ప్రేయర్ 228 యూనిట్స్, 2.28 లక్షలు
–పవర్ స్ప్రేయర్ 234 యూనిట్స్, 22.06 లక్షలు
–డ్రోన్ 1 యూనిట్, 5 లక్షలు
–రోటోవేటర్ 135 యూనిట్స్, 64.80 లక్షలు
–విత్తనాలు, ఎరువు వేసే యత్రం 30 యూనిట్లు, 9 లక్షలు
–డిస్క్ ప్లవ్, కల్టీవేటర్, కేజ్ వీల్స్ 141 యూనిట్స్, 27.58 లక్షలు
–బోదెలు చేసే యత్రం 8 యూనిట్స్,1.04 లక్షలు
–పవర్ వీడర్ 10 యూనిట్స్,6 లక్షలు
–బ్రష్ కట్టర్ 6 యూనిట్స్, 2.10 లక్షలు
–గడ్డి కట్టలు కట్టే మెషిన్ 5 యూనిట్స్, 5 లక్షలు
–పవర్ టిల్లర్ 7 యూనిట్స్ 7 లక్షలు
–ట్రాక్టర్ 4 యూనిట్స్, 20 లక్షలు
–మొక్కజొన్న వొలిచే యంత్రం 1 యూనిట్, 1 లక్ష