— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
— కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
State Formation Day : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై శనివారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని, ఇందుకుగాను అవసరమైతే రైన్ ప్రూఫ్ టెంటు వేయించాలని చెప్పారు. వివిధ శాఖల అభివృద్ధిని తెలిపే విధంగా శకటాలను ప్రదర్శించాలని, అదే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని, అత్యవసర సేవలను అందించే వైద్య ఆరోగ్య, ఫైర్, ఆర్అండ్ బి తదితర శాఖలు వారి శాఖల ద్వారా ముఖ్యమైన సేవలు ప్రజలకు తెలిసే విధంగా ప్రదర్శించాలని అన్నారు.రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా పోలీస్ పరేడ్ మైదానంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని డీఈఓ ను ఆదేశించగా, వేడుకలకు వచ్చే వారందరికి కుర్చీలు, తాగునీరు, టెంట్లు,ఇతర ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, వేడుకల నిర్వహణలో భాగంగా పోలీస్ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల వివరాలను, షెడ్యూల్ ను తెలియజేస్తూ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, ఉదయం 9 గంటల 45 నిమిషాలకు క్లాక్టవర్ సెంటర్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద మంత్రితో పాటు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తారని, ఉదయం 10 గంటలకు పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాక ఆవిష్కరణ, శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్ సుదర్శన ఉంటుందని తెలిపారు. క్లాక్ టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డయాస్ తో పాటు, ఇరువైపుల ప్రముఖులు ప్రజలు, మీడియా, అధికారులకు సీటింగ్ ఏర్పాటు చేయాలని, వర్షం వచ్చిన తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పరేడ్ గ్రౌండ్లో మున్సిపల్ కమిషనర్, తసిల్దార్, రిజర్వు ఇన్స్పెక్టర్లు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ ద్వారా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమైన శాఖలు శకటాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా ఆయా కార్యాలయాలలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఉద్యోగులందరూ పోలీస్ పరేడ్ మైదానంలో హాజరు కావాలని చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో ఎస్ఈ ని కోరారు. స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.