Altaf Hussain : గణతంత్ర రాజ్య విలువల పరిరక్షణకు పునరంకితమవుదాం ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్.
Altaf Hussain : ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. చారిత్రక సాంస్కృతిక పునాదులపై భిన్నత్వాలను ఏకం చేస్తూ స్వేచ్ఛ సమానత్వం సోదర భావం సమ్మిళితత్వాన్ని సాధించే ఉత్తమ సాధనంగా భారత రాజ్యాంగం నిలుస్తుంది అన్నారు.
అత్యుత్తమ రాజ్యాంగాల్లో బాసిల్లుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. ప్రతి పౌరుని ఆకాంక్షలను ప్రతిబింబించే , హక్కులను పరిరక్షిస్తూ భవిష్యత్తును వాగ్దానం చేసే ప్రగతి మార్గంగా రాజ్యాంగాన్ని కీర్తించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అధ్యయనం ద్వారా విలువలను ఆకలింపు చేసుకొని సమున్నత భారతానికి పాటుపడాలని సూచించారు. విశ్వవిద్యాలయాల్లో మరిన్ని పరిశోధనలు జరగాలని, సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లకు పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అత్యుత్తమ సదుపాయాలను వనరులను సమకూర్చే ప్రయత్నం నిరంతరం జరుగుతుందని తెలిపారు. అనంతరం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాళ్లు డా మారం వెంకటరమణారెడ్డి, సుధారాణి, ఆచార్య ఆకుల రవి, డా మిర్యాల రమేష్, డా మదిలేటి ట ప్రేమ్సాగర్ డా శ్రీదేవి ఆచార్య రేఖ, తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.