— సర్జికల్ బ్లేడుతో మర్మాంగం కోసివేసిన వైనం
— బిహార్లోని గంగాపూర్లో ఘటన
ప్రజాదీవెన, పట్నా: కోల్కతా వైద్యురాలి (Kolkata doctor) హత్యాచార ఘటన మరువక ముందే.. బిహార్ (Bihar)లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక నర్సుపై సామూహిక అత్యాచారయత్నం జరిగింది. ఓ వైద్యుడు తన ఇద్దరు సహచరులతో కలిసి ఈ దారుణానికి పాల్పడగా నర్సు వైద్యుడి మర్మాంగాన్ని (Private part) సర్జికల్ బ్లేడ్ (surgical blade) తో కోసేసి తప్పించుకుంది. అనంతరం ఆమె పోలీసులకు (Police) సమాచారమివ్వగా.. వారు వెంటనే అక్కడికి చేరుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బిహార్లోని సమస్తిపూర్ జిల్లా గంగాపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ ఆస్పత్రిలో ఏడాదిగా నర్సు పని చేస్తోంది. బుధవారం రాత్రి ఆమె విధులు ముగించుకొని ఇంటికెళ్తుండగా.. ఆస్పత్రి నిర్వాహకుడైన డాక్టర్ సంజయ్ కుమార్ సంజు, తన సహచరులు సునీల్ కుమార్ గుప్తా, అవధేశ్ కుమార్లతో కలసి అడ్డుపడ్డాడు. అప్పటికే పూటుగా మద్యం సేవించిన వారు నర్సును వేధించసాగారు. ఈ నేపథ్యంలోనే సంజయ్ ఆమెను పక్కకు లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె చేతికి దొరికిన సర్జికల్ బ్లేడుతో అతడి మర్మాంగంపై దాడి చేసింది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తగా.. సునీల్, అవధేశ్ ఆమెను వెంబండించారు.
ఈ నేపథ్యంలోనే ఓ చోట దాక్కొని ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గాయపడిన వైద్యుడికి ఓ ఆస్పత్రిలో గోప్యంగా చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సర్జికల్ బ్లేడ్, రక్తంతో తడిసిన బెడ్ షీట్లతో పాటు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారయత్నానికి ముందే ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను నిందితులు ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.