Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

General Strike : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ

General Strike : ప్రజా దీవెన నల్గొండ : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని జూలై 9 న జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు బి. నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సిఐటియు, ఏఐటీయూసీ ఐ ఎన్ టి యు సి, ఐ ఎఫ్ టి యు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం క్లాక్ టవర్ వద్ద జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారాంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వంద సంవత్సరాల లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను ముందుకు తెచ్చిందని అన్నారు.

 

వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోడ్ ల అమలు ఐదు సంవత్సరాలు ఆలస్యమైనా వాటిని ఇప్పుడు అమలు చేస్తూ పూర్తిగా కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను వెనక్కి కొట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించాయని వాటిని నల్గొండ జిల్లాలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు వాటిలిందని అన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్ లు అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సామాజిక భద్రతా పథకాలుకు నిధులు తగ్గిస్తున్నది కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ చేసిన కార్మిక సంఘాలు రద్దు చేసేందుకు బలితెగించిందని విమర్శించారు.

చట్టాలు అమలు చేయని యాజమాన్యాలకు శిక్షలు తగ్గించడం కార్మిక శాఖను పూర్తిగా ఫెసిలిటేట్ విభాగంగా మార్చడం, స్కీం వర్కర్లను కార్మికులకు గుర్తించకుండా వెట్టిచాకిరి చేసే విధంగా లేబర్ కోడ్ లను రూపొందించారని అన్నారు. కార్మికుల సమ్మెకు నిర్వీర్యం చేస్తూ సమ్మె చేయలేని పరిస్థితులను ఈ కోడు ద్వారా కల్పించి కార్మికులను తిరిగి బానిసత్వంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈ నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు కార్మిక వర్గం అంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఏఐటీయుసీ జిల్లా కోశాధికారి కె ఎస్. రెడ్డి, ఉపాధ్యక్షులు డి. వెంకన్న, సిఐటియు టౌన్ కన్వీనర్ అవుట రవీందర్, పోలె సత్యనారాయణ,అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి సలివొజి సైదాచారి, పల్లె నగేష్, సాగర్ల మల్లయ్య, నోముల యాదయ్య ఐఎన్టీయూసీ జిల్లా వార్కింగ్ ప్రెసిడెంట్ మైనుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న, ఐఎఫ్టియు జిల్లా నాయకులు సాగర్, అయోధ్య సంఘాల నాయకులు ,సంబిరెడ్డి వెంకన్న,జానీ,వీరయ్య, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.