–ప్రజాపాలనంటే ఉద్యమాలపై నిర్బంధమేనా
–సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
CITU D.P. Chinapaka Lakshminarayana : ప్రజాదీవెన నల్గొండ టౌన్ :తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాల పై నిబ్బందాన్ని ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమకు ఇచ్చిన హామీల అమలు కోసం శాంతియుతంగా చలో హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘాల పైన సిఐటియు నాయకత్వం పైన నిర్బంధాన్ని ప్రయోగించడం ఏ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యమో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఎన్నికల ముందర తమ ఓట్ల కోసం కాంగ్రెస్ అధికారంలోకొస్తే కనీస వేతనాలు ఇస్తామని పర్మినెంట్ చేస్తామని సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఈ 15 నెలల కాలంలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా బిఆర్ఎస్ కంటే ఎక్కువగా నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాలను ఆపాలనుకుంటే రాష్ట్ర కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ఆశా వర్కర్స్, అసంఘటితరంగా కార్మికుల, మధ్యాహ్న భోజనం, చలో హైదరాబాద్ సందర్భంగా మహిళలని చూడకుండా అర్థరాత్రి అరెస్టులు చేసి స్టేషన్ కు తరలించడం, హైదరాబాద్ కు వెళ్లిన వారి పట్ల కర్కశంగా వ్యవహరించడం నిరంకుశ పాలనకు నిదర్శనం అని అన్నారు. కెసిఆర్ ఇందిరాపార్కును మూసివేస్తే రేవంత్ రెడ్డి ఇందిరాపార్క్ రానివ్వ కుండా కార్మికుల గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన ఉద్యమాల పట్ల ప్రభుత్వం వివరిస్తున్న నిర్బంధ పద్ధతులను ప్రజాస్వామిక వాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.