–సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
–పట్టణంలో పలుచోట్ల నిరసనలు
ప్రజాదీవెన, నల్గొండ:
CITU : కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య లు పిలుపునిచ్చారు. మంగళవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా వేసినప్పటికీ డిమాండ్లు కొనసాగిస్తూ నిరసనలు తెలియజేయాలని అఖిల భారత కమిటీ పిలుపుమేరకు నల్గొండ పట్టణంలో పలు చోట్ల వలస కార్మికుల అడ్డా దగ్గర, మార్కెట్ అమాలీల బైక్ ర్యాలీ, సుభాష్ విగ్రహం దగ్గర పలు రంగాల కార్మికులు నల్ల జెండాలు ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడుగా వ్యవహరిస్తూ కార్పోరేట్లకు అనుకూలంగా 100 సంవత్సరాల కార్మిక పోరాటాల ఫలితంగా సాధించుకున్న అనేక చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికుల తరహాలో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ, కనీస పెన్షన్ 9వేలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. వలస కార్మికులకు కనీస భద్రతా కల్పిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
పట్టణంలో పలుచోట్ల జరిగిన నిరసన కార్యక్రమాల్లో సిఐటియు నల్గొండ పట్టణ నాయకులు అవుట రవీందర్, అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, కత్తుల యాదయ్య, కొత్త రాజు, ప్రభు చారి, యాదగిరి రెడ్డి, చంద్రశేఖర్, వజ్జా పరమేష్, కొత్త నాగయ్య, ఆంజనేయులు, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.