Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm Revanth Reddy: విద్యార్థుల్లో విశ్వాసo నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నం

–సంక్షేమ హాస్టళ్లలో సరికొత్త మెనూ
–విద్యార్థులపై పెట్టేది ఖర్చు కాదు పెట్టుబడి
— ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

ప్రజాదీవెన, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లా చిలుకూరులో స్కూళ్లు, హాస్టల్స్‌లో కామన్ డైట్ ప్రారంభించిన తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గురుకులాల్లో విద్యార్థులకు సరికొత్త డైట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్స్‌లో చదివితేనే విద్యార్థులు రాణిస్తారనే అపోహ ఉండేదని, సంక్షేమ హాస్టల్స్‌లోని విద్యార్థుల్లో విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

తొలిసారి సర్వేల్లో సంక్షేమ హాస్టల్..
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తొలిసారి సర్వేల్‌లో సంక్షేమ పాఠశాలను ప్రారంభించారని సీఎం గుర్తు చేశారు. సర్వేల్‌లో చదివిన అనేక మంది కీలక పదవులు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం 8 ఏళ్లుగా డైట్ ఛార్జీలు పెంచలేదన్న సీఎం రేవంత్, డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామన్నారు. కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచి విద్యార్థులకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఎక్కువ ఫీజులు ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌లో ఎక్కువ మంది చదువుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆలోచించాలి. విద్యార్థుల మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. ఓ పెట్టుబడి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

గురుకులాలపై ప్రభుత్వం ఫోకస్..
ఈ నేపథ్యంలోనే సంక్షేమ హాస్టల్స్‌పై ఫోకస్‌ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తనిఖీల పేరుతో ఇవాళ హాస్టల్స్‌ బాటపట్టింది. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా హాస్టల్స్‌, గురుకులాల్లో తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి.. వాళ్లతో కలిసి భోజనాలు చేశారు. రంగారెడ్డి జిల్లా చిల్కూర్‌లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. అక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్‌ ప్రారంభించారు. అనంతరం, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

ప్రతి నెల 10న బకాయిల చెల్లింపు..
ఇక నుంచి ప్రతినెల 10న గురుకులాలు,హాస్టల్స్ బకాయిల చెల్లింపు జరుపుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రీన్‌ఛానల్ ద్వారా నేరుగా అకౌంట్లలో జమ చేస్తామన్నారు. ఇకపై ప్రతినెలా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు గురుకులాలు, హాస్టల్స్‌ను విధిగా పరిశీలిస్తారని సీఎం స్పష్టం చేశారు. గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్‌కు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, విద్యార్థుల్లో స్కిల్స్ కోసం టాటాగ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇందులో భాగంగానే 75 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ఐటీఐలో చేరితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

బోనకల్ లో డిప్యూటీ సీఎం భట్టీ..

అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా బోనకల్‌లో బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లోని గిరిజన వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలలో పిల్లలతో కలిసి భోజనం చేశారు మంత్రి సీతక్క. అనంతరం, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనాల్లో క్వాలిటీ తగ్గితే సహించేది లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను సర్వీస్‌ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.