— రైతును రాజును చేయడమే ధ్యేయం
— వ్యవసాయాన్ని పండగల మార్చేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటం
— రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
— నూతన సాంకేతికత పై రైతులకు అవగాహన కల్పించాలని సూచన
— 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే నెంబర్ వన్ గా రాష్టం
— రైతులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం
ప్రజాదీవన, నల్గొండ బ్యూరో:
Rythu Bharosa: రైతు భరోసా కింద 9 రోజుల్లో రాష్ట్రంలోని రైతాంగం అందరికీ 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రైతులను రాజుగా చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేయడంలో భాగంగా రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు.గతంలో మాదిరిగానే రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చి వాణిజ్య పంటలు పంటలు పండించే విధంగా ప్రోత్సహించాలని, ముఖ్యంగా సోలార్ ద్వారా పంపుసెట్లు నిర్వహించుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను వేదిక నుండి ఆదేశించారు.
రైతు వేదికలలో అనుభవజ్ఞుల ద్వారా తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులు సాధించే విధంగా, నూతన సాంకేతికత పై రైతులకు అవగాహన కల్పించాలని, అవసరమైతే నిష్ణాతుల ద్వారా రైతు వేదికల ద్వారా తెలియజేసేందుకు గౌరవ వేతనం కూడా ఇవ్వాలని, సోలార్ పంప్ సెట్ల ప్రయోజనం, భూసారం ఆధారంగా ఏ పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయో తెలియజేయాలని, ముఖ్యంగా ఉద్యాన, పండ్లతోటల పండించే విధంగా ప్రోత్సహించాలని, పంట మార్పిడి చేయాలని, రైతుల ఆలోచనలో చైతన్యం తీసుకొచ్చే విధంగా చూడాలని చెప్పారు.
గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలలో కేవలం 16 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎవరూ చేయని విధంగా కేవలం 4 నెలల్లో 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని తెలిపారు. సన్న వడ్లు పండించిన రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడమే కాకుండా, 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేశామని, ఈ సంవత్సరం రెండు కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు.
గత ప్రభుత్వం గ్రామపంచాయతీ బిల్లుల పెండింగ్ లో ఉంచిందని, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చేయలేదని, 8 లక్షల 29 వేల కోట్ల రూపాయలు అప్పులను మిగిల్చి తమకు అప్పగించగా, ఒక్కో వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్తున్నామని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ తోపాటు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తున్నామని, అలాగే అప్పులు చెల్లిస్తున్నామని 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, వ్యవసాయం పై లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, సివిల్ సర్వీస్ చదువులు చదివే వారికి రాజీవ్ గాంధీ స్కాలర్షిప్ కింద రెండు లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్ మాట్లాడారు. కాగా చింతపల్లి మండలం నసర్ల పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు బిక్కని రాణమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రితో ముఖతా ముఖి మాట్లాడుతూ..
తనకు నాలుగు ఎకరాల పొలం ఉందని, సన్న వడ్లు వేయడం జరిగిందని, 8 పుట్లు పండిందని, ప్రభుత్వం తనకు 1,80,000 రుణమాఫీ చేసిందని, బోనస్ కింద 15000 వచ్చిందని 17,100 రైతు భరోసా వచ్చిందని తమ కుటుంబం అందరూ సంతోషంగా ఉన్నారని, తనకు ఇద్దరు పిల్లలని చదువుతున్నారని ప్రభుత్వం తమను ఇలాగే ఆదుకోవాలని, రైతు భరోసా, బోనస్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ముఖ్యమంత్రి రాణమ్మ తో మాట్లాడుతూ.. పిల్లలను బాగా చదివించాలని, చదువుకుంటే నే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి1600 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ప్రారంభించారు. కాగా రైతు నేస్తం కార్యక్రమానికి రాష్ట్రస్థాయిలో పలువురు మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లు ఎంపీలు ఎమ్మెల్సీలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ జానయ్య వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొనగా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్,
దేవరకొండ ఆర్డీవో రమానారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్,మండల వ్యవసాయ అధికారి, ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు.
అనంతరం జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు రైతు వేదిక పక్కనే గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఇక్కడ 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉండగా, అవన్నీ శిథిలావస్థకు రాగా వాటిని మరమ్మత్తు చేయించి లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని శాసన సభ్యులు కోరగా, ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆ తర్వాత పక్కనే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు పరిశీలించారు. లబ్ధిదారులు మమతతో మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా ఇందిరమ్మ ఇంటిని పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.