Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Ila Tripathi : సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Collector Ila Tripathi : ప్రజాదీవెన , నల్గొండ : రబీ ధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రైతులు, కొనుగోలుదారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు వేగవంతం అయ్యేలా చూడాలని అన్నారు. బుధవారం ఆమె నల్గొండ మండలం గట్టు కింది అన్నారం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో డీసీఎంఎస్ ద్వారా ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ కేంద్రంలో సుమారు 150 కుప్పలు ధాన్యం రాగా, ధాన్యం తక్షణమే కొనుగోలు వేగవంతం చేసి మిల్లులకు పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. ఒకేసారి ధాన్యం కుప్పలన్నీ సరైన తేమశాతం కలిగి రావడం, అయితే తాలుతో రావడం,అదే సమయంలో ఎక్కువ లారీల అవసరాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించేందుకు అక్కడినుండే మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్ తో మాట్లాడి లారీలు ఏర్పాటు చేయించారు. తాలు విషయమై రైతులతో ఆమె మాట్లాడుతూ తాలు, తరుగు లేకుండా సరైన తేమ శాతం తో ధాన్యాన్ని తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని చెప్పారు.

నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. మిల్లర్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. అప్పటికప్పుడే ఆమె సుమారు 30 లారీలను ఏర్పాటు చేయించి 60 కుప్పలు కొనుగోలు కేంద్రం నుండి పంపించే విధంగా చర్యలు తీసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెలుగుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సైతం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రికార్డుల నిర్వహణ సక్రమంగా చేయాలని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండాలని, రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తీసుకువచ్చే విధంగా రైతులకు కౌన్సిలింగ్ చేయాలని మిల్లర్లు, రైతులు, కొనుగోలుదారులు అందరు సమన్వయంతో పనిచేసి రబీ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు. నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, తదితరులు ఉన్నారు.