— సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
CPM Mudireddy Sudhakar Reddy : ప్రజాదివేనా నల్గొండ టౌన్ : ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం సిపిఎం పట్టణ పేదల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రజలకు 6 గ్యారంటీ ల పేరుతో పథకాలు వాగ్దానాలు చేసి అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా 12 వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం గ్రామీణ ప్రాంతాల్లో అనేక కొర్రీలు పెట్టి ఇవ్వడం లేదని అన్నారు. భూమిలేని పేదలు పట్టణాల్లో ఉంటే పేదలు కారా అని ప్రశ్నించారు. పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తూ సంవత్సరానికి 12000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో భూములు లేక ఉపాధి కరువై పట్టణ ప్రాంతాలకు వలసలు వచ్చి అడ్డా కూలీలుగా జీవనోపాధి పొందుతున్న పేదలకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణంలో సిపిఎం పలు బృందాలుగా వార్డుల లో సర్వే చేసిన సందర్భంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. అనేక సంవత్సరాలుగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారని కొత్త పెన్షన్లు వెంటనే ఇవ్వాలని ,ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు.
అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో విలీన పంచాయితీలలో, పానగల్లు పెద్ద బండ ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం లేదని వార్డు కార్యాలయాలకు వెళ్లడానికి లింకు రోడ్లు లేవని నేటికీ కొన్ని ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పట్టణంలో కతాల గూడెం పెద్దబండ పానగల్లు, చర్లపల్లి తదితర స్మశాన వాటిక లకు ప్రహరీ గోడలు లేక ఆక్రమణలకు గురవుతున్నాయని వాటికి వెంటనే ప్రహరీ గోడలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ సూపర్డెంట్ కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేయడం జరిగింది.
పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండంపల్లి సత్తయ్య, అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ , దండెంపల్లి సరోజ, మైల యాదయ్య, కోట్ల అశోక్ రెడ్డి, గాదె నరసింహ, భూతం అరుణ, ఊట్కూరు మధుసూదన్ రెడ్డి, ఆకిటి లింగమ్మ, పట్టణ పేదల సంఘం కమిటీ సభ్యులు మిరియాల శ్రీవాణి, సునీత, ఎల్లమ్మ నాగరాజు శ్రీను కుమార్ నరసమ్మ లక్ష్మమ్మ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.