విజయీభవ..!
–పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
–నేటి నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహణ
–పరీక్షలకు హాజరుకానున్న 18,666 మంది విద్యార్థులు
–105 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
DEO Bikshapati : ప్రజాదీవెన , నల్గొండ : విద్యార్థి దశలో కీలకం పదో తరగతి. భవిష్యత్తుకు సరైన పునాది పడేది ఈ సమయమే. ఇక్కడ వేసిన అడుగే.. మేలి మలుపు. అందుకే ప్రతి విద్యార్థికీ పదో తరగతి పరీక్షలు ముఖ్యమైనవి. చక్కని ప్రణాళికతో చదివితే.. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాస్తే విజయం సిద్ధించడమే కాదు.. మంచి మార్కులూ సాధించగలమని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా విద్యాశాఖాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గడిచిన విద్యాసంవత్సరం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా 9 స్థానంలో నిలిచింది. అంతకు ముందు ఏడాది కంటే గత ఏడాది మంచిర్యాంకు ను సాధించి సగర్వంగా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాదు.. మరింత
మెరుగుపర్చేలా కొద్ది రోజుల నుంచి అధికారయంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకువెళ్లింది. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకం శ్రద్ధ తీసుకుని, వారిని కనీసం ఉత్తీర్ణత సాధించేలా సిద్ధం చేశారు.
మాస్ కాపీయింగ్ కు తావులేకుండా చర్యలు..
పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 18666 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 9669 మంది కాగా, బాలికలు 8997 మంది. పరీక్షల నిర్వహణ గాను జిల్లాలో 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ గాను ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక్క చీఫ్ సూపర్డెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారి చొప్పున 105 మంది సిఎస్ లు, 105 మంది డివోలను, 986 మంది ఇన్విజిలేటర్లు, 7గురు రూట్ ఆఫీసర్లు, 6 గురు ఫ్లయింగ్ స్కాడ్స్, 13 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా తమ వెంట హాల్ టికెట్స్ ను తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ఇతర ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
సెల్ఫోన్లకు విరామమిద్దాం…
–పరీక్షల సమయంలో సెల్ఫోన్లకు విద్యార్థులు విరామమివ్వాలి. భావోద్వేగాలను ప్రభావితం చేసే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. అధిక సమయం వాటితో గడిపి, విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు.
–వినోదం కోసం టీవీలు, సినిమాలు, విందులు, వేడుకలు వంటివాటిని పరీక్షా కాలంలో పూర్తిగా పక్కనపెట్టాలి.
ఇవి నిబంధనలు….
–పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు. ఎవరి మొబైలూ అనుమతించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చినా, పరీక్ష కేంద్రాల ప్రధాన గేటు వద్ద వాటిని భద్రపర్చుకోవాలి.
–పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
–పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్స్, నెట్ సెంటర్లన్నీ మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
–పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. వీటిని అన్ని మండలాల స్టేషన్ హౌస్ లో భద్రపరిచారు.
–ప్రతి కేంద్రంలోనూ తాగునీరు, ప్రథమ చికిత్సకు సంబంధించి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు.