–మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి
–ప్రత్యేకించి ఒక్కో ప్రదేశం వద్ద ఒక సీఐ స్థాయి అధికారిని నియమించాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : బుద్ధపూర్ణిమ సందర్భంగా మే 12న నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుధవనాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మిస్ వరల్డ్ పోటీ దారుల రాక ఏర్పాట్ల విషయమై సోమవారం సాయంత్రం ఆమె తన ఛాంబర్ లో పర్యాటక, రెవెన్యూ, పోలీస్, తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రపంచ సుందరి ఫోటిదారులు బుద్ధపూర్ణిమ సందర్భంగా నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ద వనానికి రానున్నారని, ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 4:30 నుండి 7:30 వరకు విజయ విహార్, బుద్ధ వనంలలో వారు గడిపే అవకాశం ఉందని తెలిపారు. ముందుగా వీరు హైదరాబాద్ నుండి వచ్చే దారిలో చింతపల్లి వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుని బుద్దవనానికి బయలుదేరుతారని, అనంతరం బుద్ధ వనంలో జాతక వనం పరిశీలిస్తారని, అనంతరం బుద్ధుని ధ్యాన మందిరంలో ధ్యానంలో పాల్గొంటారని, అందువల్ల వారికి ఎలాంటి లోటు పాట్లు కలగకుండా చూసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన ఏర్పాట్లపై రెవెన్యూ అధికారులకు అలాగే బందోబస్తుపై పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
పాసులు ఉన్న వారిని తప్ప ఇతరులు ఎవరిని బుద్ధ వనంలోకి అనుమతించకూడదని చెప్పారు. విజయ్ విహార్ లో వారు విశ్రాంతి తీసుకునేందుకు రూములు సిద్ధం చేయాలని, ఒకవేళ నాగార్జునసాగర్ డ్యామును చూసేందుకు వచ్చినట్లయితే అక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది తాగునీరు, దారి పొడవున పారిశుధ్యం నిర్వహించాలన్నారు. ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనేవారు తిరిగే అన్ని ప్రదేశాలను ముందే తిరిగి పరిశీలించాలని, సిసిటీవీలు ఏర్పాటు చేయాలని, మెడికల్ టీం, ఫైర్ టీములు ఏర్పాటు చేయాలని, ఆహారం, తాగునీరుతో పాటు, అన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకించి ఒక్కో ప్రదేశం వద్ద ఒక సీఐ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించాలని పోలీసు అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె పునరుద్ఘాటించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, బుద్ధవనం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సూధన్ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్, మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారుల తోపాటు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి, ఫారెస్ట్ అధికారులు, తదితరులు హాజరయ్యారు.