–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
–జ్యోతి బాపూలే జయంతి రోజున ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలి
–బీసీ సంఘం నేతలు
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 11న నిర్వహించనున్న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల ఏర్పాట్ల విషయమై బిసి సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలు, తదితర సంఘాల ప్రతినిధులు,అధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్,డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేడుకల మాదిరిగానే జ్యోతిబాపూలే వేడుకలను సైతం నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని తెలిపారు.
వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల మాదిరిగానే మహాత్మా జ్యోతిబాపూలే జయంతి రోజున ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని, వేడుకల సందర్భంగా స్టేజి పై రిజిస్టర్డ్ సంఘాల నుండి ఒక్కొక్కరిని మాట్లాడేందుకు అనుమతించాలని, వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిధులు ఎక్కువగా కేటాయించాలని, పాఠశాల విద్యార్థులకు జ్యోతిబాపూలే చేసిన పనులను తెలిసేలా అవగాహన కల్పించాలని, విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని, అన్ని కార్యాలయాలలో జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలు నిర్వహించాలని, బీసీ సంక్షేమ శాఖ ద్వారా బీసీలకు అమలు చేసిన పథకాలపై ప్రగతి నివేదిక సమర్పించాలని, మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల సందర్భంగా అవసరమైన టెంటు,డయాస్, కుర్చీలు, తాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, జిల్లా సహాయ బీసీ సంక్షేమ అధికారి సంజీవ్, వివిధ బీసీ సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.